బోధన్, మార్చి 27: ‘గోకృపామృతం’తో ప్రకృతి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, గోకృప అమృతం మనకు ప్రకృతి ప్రసాదించిన దివ్యమైన వరం అని గోకృపామృతంపై విస్త్రృత పరిశోధనలు చేసి, దీని ద్వారా లక్షలాది ఎకరాల్లో ప్రకృతి సేద్యం వైపు రైతులను నడిపిస్తున్న గుజరాత్కు చెందిన గోపాల్ సుతారియా అన్నారు. బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో ‘మన ఊరు – మన బాధ్యత’ సౌజన్యంతో బోధన్ రైతుల సహకారంతో ‘గోపామృతం ద్వారా వ్యవసాయం’పై శనివారం అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో గోపాల్ సుతారియా గోకృపామృతం తయారీ, ప్రయోజనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గోపాల్ సుతారియా మాట్లాడుతూ.. ఒకప్పటి ప్రకృతి వ్యవసాయాన్ని మానవుడు నాశనం చేసుకోవడంతో పర్యావరణం దెబ్బతినడంతో పాటు ప్రజలు రోగాలబారిన పడుతున్నారని అన్నారు.
ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా గోఆధారిత ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టిని మళ్లించాలని కోరారు. పంచగవ్య, ఆయుర్వేద ద్రవ్యాల సమ్మేళనమే గోకృప అమృతమని పేర్కొన్నారు. ఒక లీటర్ గోకృపామృతాన్ని ఒక పెద్ద డ్రమ్ములో 200 లీటర్ల నీటిలో కలిపి, దానికి రెండు లీటర్ల స్వచ్ఛమైన తాజా ఆవు పెరుగును, సేంద్రియ పద్ధతిలో తయారైన రెండు కిలోల బెల్లాన్ని కలపాలన్నారు. ఆ ద్రవాన్ని రోజుకు రెండుసార్లు సవ్యదిశలో రెండు నిమిషాలపాటు కలపాలని, మిగతా సమయంలో గుడ్డ కట్టాలన్నారు. ఆరు రోజుల తర్వాత, ఏడో రోజు నుంచి ఇలా తయారైన 205 లీటర్ల గోకృపామృతాన్ని వాడుకోవచ్చన్నారు. గోకృపామృతంతో నేల సారవంతమవుతుందని, రసాయనిక ఎరువులతో విష ప్రభావాన్ని తుడిచిపెడుతుందని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండానే మంచి దిగుబడులతో విషరహితమైన పంటలను పండించవచ్చని గోపాల్ సుతారియా అన్నారు.
గోపాల్ సుతారియా హిందీ ప్రసంగాన్ని ‘మన ఊరు – మన బాధ్యత’ సంస్థ ప్రతినిధి సూర్యకళ అనువాదించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ గోపాల్ సుతారియా రూపొందించిన గోకృపామృతం ఆధారిత వ్యవసాయాన్ని రైతులు ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సుకు అఖిల భారత సమన్వయ సమితి డైరెక్టర్, ఆదర్శ రైతు ఎం.అప్పిరెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో బోధన్ ఏకచక్రేశ్వర గోరక్షణ సమితి అధ్యక్షుడు నేపాల్సింగ్ రాజ్పురోహిత్, ప్రధాన కార్యదర్శి వినోద్ పట్వారీ, ఆర్యసమాజ్ బోధన్ శాఖ ప్రధాన్ చిదుర ప్రదీప్గుప్తా, రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం అధినేత డాక్టర్ నవీన్, వ్యవసాయ శాస్త్రవేత్త రెహానా బేగం, బోధన్ ఏడీఏ సంతోష్, పొరుగున మహారాష్ట్రలోని సగ్రోలి కృషి విజ్ఞాన కేంద్రం అధినేత వెంకట్షిండే, ఎన్సీఎస్ఎఫ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొండెల సాయారెడ్డి, ఆదర్శ రైతులు చిన్ని కృష్ణుడు, మెదక్కు చెందిన మురహరిరావు తదితరులు పాల్గొన్నారు.