50 పడకలతో నిజామాబాద్ జిల్లా దవాఖానలో తక్షణంప్రత్యేక వార్డు ఏర్పాటు
తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు
ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర మంత్రి వేముల
లాక్డౌన్, వ్యాక్సినేషన్, కరోనాపై చర్చ
నిజామాబాద్, మే 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతున్నదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ప్రస్తుతం కేవలం 374 మందికి మాత్రమే చికిత్స అందుతుండడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. నిజామాబాద్ కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, వైద్యాధికారులతో మంత్రి వేముల గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. లాక్డౌన్ అమలు తీరుతెన్నులు, కరోనా వైరస్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు. శుక్ర, శనివారాల్లో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. నిజామాబాద్లో ఆరు వేల మందిని గుర్తించామని, వీరందరికీ టీకాలు వేయడం ద్వారా కరోనా ఎక్కువ మందికి సోకకుండా నిరోధించవచ్చన్నారు.
జీజీహెచ్లో బ్లాక్ ఫంగస్ వార్డు..
బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలోనే ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వేముల తెలిపారు. 50 పడకలతో ప్రత్యేక వార్డును తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. బ్లాక్ఫంగస్ వ్యాధికి సంబంధించిన ఔషధాలు వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభిస్తామన్నారు. జిల్లా ప్రజలెవ్వరూ హైదరాబాద్కు వెళ్లి బ్లాక్ ఫంగస్ చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉండబోదన్నారు. ప్రైవేటు దవాఖానల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చవుతున్నదని, ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను పొందాలని పిలుపునిచ్చారు. బ్లాక్ ఫంగస్ సోకిన ఒక్కో పేషెంట్కు వాడే ఇంజక్షన్లు, మందులకు సుమారుగా రూ.రెండున్నర లక్షల మేర ఖర్చు కానుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం, కరోనా నివారణకు అలుపెరగని కృషి చేస్తున్నదని చెప్పారు. బాధ్యతగా ఉంటూ ప్రభుత్వానికి బాసటగా నిలువాలన్నారు.
పాజిటివ్ రేటులో తగ్గుదల..
నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు 8శాతానికి పడిపోయిందని మంత్రి వేముల చెప్పారు. ప్రతి రోజూ నిర్వహిస్తున్న టెస్టులు, ఇంటింటి సర్వేలోనూ పాజిటివ్ రేటు తక్కువగా ఉంటున్నదని ఆయన వివరించారు. కరోనా సోకిన వారు భయాన్ని వీడి తగు చికిత్స తీసుకుంటే సరిపోతుందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రైవేటు దవాఖానలకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే చికిత్స తీసుకోవాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని అడ్డుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని మంత్రి ఈ సందర్భంగా కితాబునిచ్చారు. కరోనా బారిన పడినప్పటికీ ప్రజల కోసం పాటుపడుతున్న తీరు స్ఫూర్తివంతమైనదని చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్వో బాల నరేంద్ర, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ తదితరులు పాల్గొన్నారు.