నిజామాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో 442 కొనుగోలు కేంద్రాల నుంచి 7లక్షల 43వేల 531 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.1,398 కోట్లు కావడం విశేషం. కామారెడ్డి జిల్లాలో 342 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి 4లక్షల 51వేల 154 మెట్రిక్ టన్నులు సేకరించారు. దీని విలువ రూ.850.42 కోట్లు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2,248 కోట్లు విలువ చేసే 11లక్షల 94వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం రికార్డుగా చెప్పవచ్చు.
గడ్డు కాలంలోనూ కొనుగోళ్లు…
2020 ప్రారంభం నుంచి కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోతూ వచ్చింది. లాక్డౌన్ అమలు మూలంగా ప్రభుత్వాలు కఠిన సమయాలను ఎదుర్కొన్నాయి. ఈ సమయంలోనూ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేయడంతోపాటుగా పండించిన పంటను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా బూచీని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అదనంగా భారం మోపుతున్న ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ మాత్రం మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ రైతుల కన్నీళ్లు తుడుస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే సేకరించడం ద్వారా పెద్ద మనసును చాటుకుంది. సంక్షోభకాలంలోనూ అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు సీఎం కేసీఆర్ ధైర్యంగా ముందడుగు వేసి కర్షకులకు మేలు చేకూర్చారు. వరికి కనీస మద్దతు ధరను రైతన్నలకు కల్పించాలనే దృఢ సంకల్పంతో వరి సిరులను రూ.వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వమే సేకరించింది. ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం సాహసోపేతమైన చర్యగా రైతు లోకం కేసీఆర్ స్ఫూర్తిని కీర్తిస్తోంది.
పకడ్బందీగా.. పారదర్శకంగా..
రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది. ముందు నుంచి పకడ్బందీ వ్యూహం, పక్కా కార్యాచరణతో యంత్రాంగం పని చేస్తుండడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాఫీగా ధాన్యం సేకరణ ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగి -2021లో 11లక్షల 94వేల 685 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికార యంత్రాంగం సేకరించింది. నిజామాబాద్ జిల్లాలో 7లక్షల 43వేల 531 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 4లక్షల 51వేల 154 మెట్రిక్ టన్నులు మేర ధాన్యాన్ని రైతులు విక్రయించారు. వీటి మొత్తం రెండు జిల్లాల్లో కలిపితే దాదాపుగా రూ.2,248కోట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యంతో నిజామాబాద్లో 1,90,741 మంది రైతులకు ప్రయోజనం జరిగింది. కామారెడ్డి జిల్లాలో 1,12,367 మంది రైతులకు కనీస మద్దతు ధర దక్కింది. ఈ సీజన్లో ఏ గ్రేడ్ ధాన్యానికి సర్కారు రూ.1888 చెల్లించింది. సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1868 చొప్పున కొనుగోలు చేసింది. 2020 యాసంగి సీజన్తో పోలిస్తే ఉభయ జిల్లాల్లో భారీగా ధాన్యం దిగుబడి వచ్చింది. కామారెడ్డి జిల్లాలో గతేడాదితో పోలిస్తే రూ.150 కోట్లు విలువ చేసే 80వేల మెట్రిక్ టన్నులు ధాన్యం అధికంగా వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో 2020 యాసంగిలో వచ్చిన ధాన్యంతో పోలిస్తే ఈ సీజన్లో రూ.440 కోట్లు విలువ చేసే 2లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా వచ్చింది.
యాసంగి సాగు అదిరింది
గతేడాది యాసంగి సీజన్తో పోలిస్తే 2021 యాసంగిలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వరి సాగు భారీగా పెరిగింది. గతంలో యాసంగికి పంటలు పండించాలంటే రైతులు వెనుకా ముందు ఆలోచించేవారు. భూగర్భ జలం, జలాశయాల్లో నీళ్లను ఆధారంగా చేసుకుని ముందడుగు వేశారు. లేదంటే భూమి ఉన్నప్పటికీ సాగు నీటి గోస మూలంగా పంటలు వేసేందుకు రైతన్నలు వెనుకడుగు వేయక తప్పకపోయేది. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాల మూలంగా ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ముగిసిన యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో దాదాపుగా లక్ష ఎకరాల్లో వరి పంట అధికంగా సాగవ్వడంతో ధాన్యం ఇబ్బడిముబ్బడిగా దిగుబడి వచ్చింది. వ్యవసాయ శాఖ గణాంకాల మేరకు 2021 యాసంగిలో నిజామాబాద్ జిల్లాలో 3లక్షల 4వేల 398 ఎకరాల్లో వరి సాగుకు నోచుకుంది. దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాలుండగా ప్రభుత్వం దాదాపుగా 7.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. మిగిలిన ధాన్యాన్ని రైతులే నేరుగా ప్రైవేటుకు కొనుగోలు చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 33వేల 197 ఎకరాల్లో వరి సాగు చేయగా 5లక్షల 84వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని భావించగా కొనుగోలు కేంద్రాల ద్వారా సర్కారు ఏకంగా 4.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది.