బోధన్, మార్చి 25: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలో కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తుండడంతో లాక్డౌన్ను ప్రకటించారు. గురువారం తెల్లవారుజామున 12.30 గంటల నుంచి ఏప్రిల్ 4 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ను ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. లాక్డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వర కు నిత్యావసర దుకాణాలు, మెడికల్ షాపులు తెరిచి ఉంచేందుకు సడలింపు ఇచ్చారు. లాక్డౌన్ అమల్లోకి రావడంతో.. సరిహద్దులో మన అధికార యంత్రాం గం అప్రమత్తమైంది. తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో సాలూరా, రెంజల్ మండలం కందకుర్తి వద్ద గట్టి నిఘా ఉంచారు. బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో.. వేర్వేరు పనులపై జిల్లా నుంచి మహారాష్ట్రకు వెళ్లినవారు ఏదోరకంగా సరిహద్దు దాటి వస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ సాలూరా, కందకుర్తి వద్ద, కోటగిరి మండలం పొతంగల్ వద్ద కరోనా పరీక్షలు చేస్తున్నారు. నాందెడ్, బిలో లి, దెగ్లూర్, ధర్మాబాద్ పట్టణాల్లోని ప్రధాన రహదారులతో పాటు అన్ని రహదారులు, వీధులు గురువారం నిర్మానుష్యంగా మారాయి. నాందెడ్తో జిల్లాలోని ప్రజలకు బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో నిత్యం ఇరు జిల్లాల మధ్య రాకపోకలు కొనసాగుతున్నాయి. నాందెడ్ జిల్లాతో వాణిజ్య కార్యకలాపాలు కూడా ఎక్కువే. లాక్డౌన్తో ఈ వ్యాపార లావాదేవీలు స్తంభించిపోయాయి.
మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులు రద్దు
నాందెడ్ జిల్లా లాక్డౌన్తో ఆ జిల్లామీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సులను రద్దుచేశారు. అలాగే, అక్కడి నుంచి వచ్చే మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు రద్దయ్యాయి. బోధన్ డిపో నుంచి నాందెడ్, ధర్మాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే 12 ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి.