నిజామాబాద్ రూరల్, జూన్ 24: సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారం(ఎన్సీఎస్ఎఫ్) నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకుని నడిపించాలని లేదా తమకు అప్పజెప్పితే సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రైతు ప్రతినిధులు గురువారం నిజామాబాద్లోని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు, ఎంపీ అర్వింద్ను కలిసి విన్నవించారు. పార్టీలకతీతంగా వచ్చిన రైతు ప్రతినిధులతో ఎమ్మెల్యే బాజిరెడ్డి తన నివాస ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమై అరగంట పాటు చర్చించారు. షేర్ వాటాదారులైన రైతులతో సాయి వెజిటెబుల్ అండ్ ఫ్రూట్స్ గ్రోర్స్ సంఘాన్ని స్థాపించుకున్నామని రైతు ప్రతినిధులు ఎమ్మెల్యేకు వివరించారు. ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడుపాలని లేనియెడల ఫ్యాక్టరీ రుణాలన్నింటినీ మాఫీ చేసి రైతులకే అప్పజెప్పితే నడిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మెట్పల్లిలో మూతపడి న షుగర్ ఫ్యాక్టరీని నడిపించేందుకు రైతులు ముందుకొస్తే ఇవ్వడానికి ప్రభు త్వం సిద్ధంగా ఉందని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారని రైతు ప్రతినిధు లు ఎమ్మెల్యేకు వివరించారు. పెట్రోల్లో కలిపే ఇథనాల్ను ఉత్పత్తి చేసే ప్లాంటు ఏర్పాటుకు ఫ్యాక్టరీ ఆవరణ అనుకూలంగా ఉందని తెలిపారు. గోడౌన్ల వసతి ఉందని, అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందుకు ఎమ్మెల్యే బాజిరెడ్డి స్పందిస్తూ సీఎం కేసీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని చెప్పారు. త్వరలో నిజామాబాద్ పర్యటనకు సీఎం కేసీఆర్ వస్తారని, అంతకు ముందే ఫ్యాక్టరీ విషయాన్ని వివరిస్తామన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో సాయి వెజిటబుల్ అండ్ ప్రూట్స్ గ్రోయర్స్ సంఘం అధ్యక్షులు సాయిరెడ్డి, ప్రతినిధులు రాజిరెడ్డి, ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, రాధాకృష్ణాగౌడ్, సూర్యారెడ్డి, గుండారం సర్పంచ్ లక్ష్మణ్రావు, ఉపసర్పంచ్ శంకర్రెడ్డి, పద్మారెడ్డి, సాయికుమార్, 30 మంది రైతులు ఉన్నారు.