నిజామాబాద్ లీగల్, జూన్ 24 : ఉమ్మడి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ కె.సాయి రమాదేవి తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 10న నిర్వహించనున్న లోక్ అదాలత్కు అన్ని వర్గాల సహకారం, మద్దతు కావాలని కోరారు. గురువారం ఆమె జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాసదన్లో సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భౌతిక న్యాయవిచారణకు రాని వారి కోసం మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. వర్చువల్ హియరింగ్ ద్వారా కూడా న్యాయార్థుల వివరణలు తీసుకుని పరిష్కరిస్తామన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, సివిల్ తగాదాలు, ప్రభుత్వ, ప్రైవేట్రంగ బ్యాంకు రుణాల కేసులను త్వరితగతిన పరిష్కరించి లోక్అదాలత్ ద్వారా అవార్డులు జారీ చేస్తామన్నారు. కక్షిదారులందరికీ వారి వాట్సాప్ నంబర్, మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు. ఇంకా ఏదైనా సమాచారం కావాలనుకునే వారు మండల న్యాయ సేవాధికార కార్యాలయాలు, జిల్లా న్యాయ సేవా సంస్థ, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాలని సూచించారు. దీర్ఘకాలంగా న్యాయ విచారణలో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తామని తెలిపారు. లోక్అదాలత్ విజయవంతానికి పౌర సమాజ సహకారం చాలా అవసరమన్నారు.