శక్కర్నగర్, మే 24:పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చెట్టు చేమలను పెంచాలన్నా మట్టే ప్రధానం. మట్టి లేకపోతే మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుంది. అంతటి మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితోపాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది. అందుకోసం వేసవిలో చాలా మంది మడ్బాత్ చేస్తుంటారు. నదుల్లో దొరికే మన్ను, పుట్ట మన్నును ఒంటి నిండా పూసుకొని చేసేదే మడ్బాత్, మృతిక చికిత్స.
‘మడ్బాత్’ మట్టిని తయారుచేసే విధానం..
కొండ దిగువన ఉన్న చెరువులో ఎండిన ప్రాంతలో సుమారు ఐదు ఫీట్ల లోతులో నుంచి మట్టిని సేకరించి ఎండబెడతారు. పూర్తిగా ఎండిన అనంతరం పొడిగా దంచి, అందులో గోమూత్రం, కలబంద, తులసీ, వేప, గానుగ, ఉసిరితోపాటు సుమారు 25రకాల వనమూళికల మిశ్రమాన్ని కలిపి సుమారు 12గంటలపాటు నానబెడతారు. అనంతరం మట్టిని వినియోగిస్తారు.
ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మడ్బాత్ చాలా ఉపయోగపడుతుంది. ఒళ్లంతా మట్టి పూసుకోవడం ద్వారా ఒకవైపు చల్లదనంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని, మట్టి స్నానంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయిన ప్రకృతి వైద్యశాస్త్రం చెబుతున్నది. ఇది నేటితరం వారికి వింతగా ఉన్నా అందులో దాగి ఉన్న ఆరోగ్యకర ఔషధాలు అందించే ఉపశమనం అంతా ఇంతా కాదని అనుభవజ్ఞులు చెప్పే మాట. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ బోటింగ్ పాయింట్ వద్ద పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యేటా మడ్బాత్పై అవగాహన కల్పిస్తుంటారు.