విద్యానగర్/ఇందూరు, మే 21 : కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్సెస్సీ ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. పాఠశాలల్లో నిర్వహించిన ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు చేశారు.
కామారెడ్డి జిల్లాలో 12,796 మంది ఉత్తీర్ణత..
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 12,796 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫిబ్రవరి నెలలో నిర్వహించిన ఎఫ్ఏ-1 (ఫార్మెటివ్ అసెస్మెంట్-1) లోని అన్ని సబ్జెక్టుల్లో వచ్చిన గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లను కలిపి విద్యార్థుల జీపీఏను లెక్కించారు. విద్యార్థులు తమ పాఠశాల స్కూల్ కోడ్ ద్వారా లేదా వారి పేరు, స్కూల్, పుట్టిన తేదీ వివరాలతో ఆన్లైన్ నుంచి ఫలితాలను పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిం ది. గత సంవత్సరం పరీక్షలు రాయకుండానే 9వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఈ ఏడాది కూడా పరీక్షలు రాయకుండానే ఎస్సెస్సీలో ఉత్తీర్ణత సాధించారు.
పాఠశాలల వారీగా ఇలా..
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 12,796 మంది విద్యార్థులు పదో తరగతి విద్యను అభ్యసించారు. ఎయిడెడ్ పాఠశాలలో 23 మంది, ప్రభుత్వ పాఠశాలల్లో 377, కస్తూర్బా పాఠశాలల్లో 800, మైనార్టీ వెల్ఫేర్ స్కూళ్లలో 285, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 590, ప్రైవేట్ పాఠశాలల్లో 2,334, మైనార్టీ రెసిడెన్షియల్లో 56, తెలం గాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 735, మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలల్లో 285, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 271, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదివిన 7040 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 12,796 మంది కాగా.. ఇందులో బాలురు 6,389 మంది, బాలికలు 6,407 మంది ఉన్నారు. ఇందులో 10 జీపీఏ 4,630 మంది, 9.8జీపీఏ 794, 9.7జీపీఏ 790, 9.5జీపీఏ 687, 9.3 జీపీఏ 659, 9.2జీపీఏ 691, 9 జీపీఏ 610 మంది విద్యార్థులు సాధించారు. 287 పాఠశాలలు 10 జీపీఏ సాధించగా.. ఇందులో బాలురు 2,010, బాలికలు 2,620 కలిపి మొత్తం 4,630 మంది ఉన్నారు.
నిజామాబాద్ జిల్లాలో 23,038 మంది..
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 23,038 మంది వి ద్యార్థులు ఎస్సెస్సీలో ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు విద్యార్థులు రాసిన ఎఫ్ఏ1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించారు. ఈ విద్యా సంవత్సరం పరీక్ష ఫీజులు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. జిల్లావ్యాప్తంగా 522 పాఠశాలల్లో 11,898మంది బాలురు, 11,140 మం ది బాలికలు మొత్తం 23,038 మంది విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించారు. ఇందులో 331 ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు 6,687మంది, బాలికలు 7,259 మంది ఉన్నారు. 191 ప్రైవేట్ పాఠశాలల్లో బాలురు 5,211 మంది, బాలికలు 3,881 మంది ఉన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 13,946, ప్రైవేటు పాఠశాలల్లో 9,092 మంది విద్యార్థులు ఉన్నారు.
10,056 మంది విద్యార్థులకు 10జీపీఏ..
నిజామాబాద్ జిల్లాలో మొత్తం 10,056 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఇందులో బాలు రు 4,406 మంది కాగా బాలికలు 5,650 మంది ఉన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4,096 మంది, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5,960 మంది విద్యార్థులు ఉన్నారు.
గతంలో ఫెయిలైన 90 మంది పాస్..
రెండేండ్ల క్రితం నిర్వహించిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన 90 మంది విద్యార్థులను ఈ ఏడాది పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.వీరిలో 50 మంది బాలురు, 40 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లి దండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో మెమోలు..
ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో పరీక్ష ఫీజు చెల్లించిన 12,796 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. వారందరికీ గ్రేడింగ్ ఇచ్చారు. విద్యార్థుల మెమోలను త్వరలో పాఠశాలలకు పంపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
వంద శాతం పాస్..
కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందశాతం విద్యార్థులు పాస్ అయ్యారు. జిల్లావ్యాప్తంగా పరీక్ష ఫీజు చెల్లించిన 23,038 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 10,056 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. విద్యార్థులు www.bse.telangana. gov.in వెబ్సైట్ ద్వారా మెమో, వివరాలు పొందవచ్చు.