నిజామాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న’ పెద్దలు చెప్పే మాట ఇది. ఆపదలో ఉన్నప్పుడు కావాల్సింది ప్రసంగాలు కాదు. ఉన్నంతలో సాయం చేస్తూ.. ఆపన్నులను ఆదుకుంటేనే ఆప్తులుగా గుర్తుండిపోతారు. ఒక్కపూట భోజనం వడ్డించినా… దాతృత్వాన్ని మరువబోరు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, పేదలు, వలస కార్మికులు అనేక మంది ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా బారిన పడి ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారికి భోజనం సమకూర్చుకోవడం కష్టంగా మారింది. ఒకింట్లో కుటుంబీకులందరూ కరోనా బారిన పడితే వారికి వండి వడ్డించే వారు కరువు. ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. సరిగ్గా ఏడాది క్రితం లాక్డౌన్ సమయంలో ఎంతో మంది పేదలకు సాయం చేసిన ఆయన.. సెకండ్ వేవ్ ఉధృతిలోనూ ప్రజల ఆకలిని తీర్చేందుకు ఔదార్యం చూపుతున్నారు. బాధితుల ఇంటికే వెళ్లి భోజనం అందించడంతో సహా నిజామాబాద్ నగరంలోని ప్రధానమైన వీధులు, రహదారుల గుండా వాహనాలను పంపించి అన్నార్థులకు అండగా నిలుస్తున్నారు.
సొంత ఖర్చులతో…
ఎమ్మెల్యే గణేశ్గుప్తా తండ్రి కృష్ణమూర్తి గతేడాది కరోనా కాలంలో పేదలకు ఇతోదికంగా సాయం అందించారు. నవంబర్లో కృష్ణమూర్తి కన్నుమూశారు. ఎమ్మెల్యే తన తండ్రి పేరిట ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సోదరుడు బిగాల మహేశ్గుప్తా, కుటుంబీకుల సహకారంతో విజయవంతంగా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. 14 రోజులుగా దాదాపుగా 20వేల మంది ఆకలిని తీర్చారు. వంట చేయడానికి, ఆహారాన్ని ప్యాకెట్లుగా మార్చడం కోసం 70 మందిని నియమించారు. న్యాల్కల్ రోడ్డులోని ఓ కల్యాణ మండపాన్ని తాత్కాలికంగా లీజుకు తీసుకొని వంటలు చేయిస్తున్నారు.
ఎనిమిది వాహనాలు.. ప్రధాన కూడళ్లు..
మే 7వ తారీఖు రోజు ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ప్రారంభించారు. మొదట ఆరు వా హనాలను ఇందుకోసం కేటాయించారు. ఈ వాహనాలు నగరంలోని ప్రధాన వీధులను చుట్టేస్తాయి. వినాయక్ నగర్, వర్ని చౌరస్తా, నెహ్రూ పార్క్, ఖలీల్వాడి, హ మాల్వాడి, కంఠేశ్వర్, శాంతినగర్, మాలపల్లి, బాబన్సాబ్ పహాడ్, పెయింటర్ కా లనీల్లో వాహనాలు తిరుగుతాయి. ఆయా ప్రాంతాల్లో భోజనాలను వితరణ చేసిన అనంతరం అంతకుముందే ఫోన్ చేసి భోజనం కావాలని విన్నవించిన వారి ఇంటికెళ్లి ఆహార పొట్లాలను వలంటీర్లు అందజేస్తారు. ఇంటి వద్ద ఆహార ప్యాకెట్లు తీసుకునే వారంతా కరోనా బాధితులే. ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం ఎంతో ఉపకరిస్తోంది. మొదట్లో 6 వాహనాలు ఇందుకోసం ఏర్పాటు చేయ గా ప్రజల నుంచి వస్తోన్న స్పందన భారీగా ఉండడంతో వితరణకు అదనంగా మరో రెండు వాహనాలను సమకూర్చారు. మొత్తం 8 వాహనాల్లో మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటల వరకు ఇన్టైంలో ఆహారాన్ని సమకూరుస్తున్నారు.
కష్టాల్లో కన్నీళ్లు తుడుస్తూ..
కంటికి కనిపించని కరోనా వైరస్ మూలంగా పొట్ట చేతపట్టుకుని వచ్చిన ఎంతో మంది పేదలు నిత్యం పస్తులుంటున్నారు. కరోనా సోకి ఇంట్లో ఉంటున్న వారిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ దయనీయ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే గణేశ్గుప్తా వారికి భోజనం అందించేందుకు నిర్ణయించారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతాలకే వెళ్లి ఆహార పొట్లాలను చేరవేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారి కన్నీటిని తూడుస్తూ నేనున్నా అనే భరోసాను కల్పిస్తున్నారు. లాక్డౌన్ అమలుతో అన్నీ మూతపడడంతో సర్వం స్తంభించింది. ఈ దీనావస్థలో పేదలకు చేతిలో చిల్లిగవ్వలేదు. నిరాశ్రయులకు పస్తులు తప్పడం లేదు. ఈ పరిస్థితిలో నగరమంతా పెద్ద ఎత్తున ఉచితంగా భోజనం అందివ్వడంతో సామాన్యులకు ఊరట లభిస్తున్నది. ఆకలితో విలవిల్లాడుతున్న అనేక మందికి రోజూ రుచికరమైన భోజనంతో కడుపు నింపుతుండడంతో ఎమ్మెల్యే కృషిని ప్రజలు కొనియాడుతున్నారు.
భోజన తయారీని పరిశీలించిన ఎమ్మెల్యే..
ఖలీల్వాడి, మే 20: నగరం లో కరోనా బాధితులకు, వారి సహాయకుల కోసం ప్రతిరోజూ అందించే ఉచిత భోజన ఏర్పాట్లను ఎమ్మెల్యే గణేశ్గుప్తా గురువారం పరిశీలించారు. అక్కడ చేస్తు న్న వంటలు, భోజనం ప్యాకింగ్ తదితర ప నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత సంవత్సరం 45 రోజుల పాటు రెండు వేల మంది ఫ్రంట్లైన్ వారియర్స్కి భోజనం అందజేశామని తెలిపారు. తన తండ్రి జ్ఞాపకార్థం 70 మంది క్రమశిక్షణ కలిగిన వలంటీర్లతో నిత్యం నిజామాబాద్ నగరంలో ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. భోజనం అవసరం ఉన్న వారు తాము ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 7207392708, 7207392709 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు ఉన్నారు