బోధన్/బాన్సువాడ రూరల్, మే 20 : వానకాలం పంటల సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. సాధారణ విస్తీర్ణానికి మించి సాగు నీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, అందుకు తగినట్లుగా ఉమ్మడి జిల్లా యంత్రాంగం ప్రణాళికను తయారు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయిని అయిన నిజాంసాగర్ జలాశయంలో కావల్సినంత నీరు ఉండగా, బోరుబావుల్లో భూగర్భ జలాలు, చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీరు నిల్వ ఉండడంతో ఈ ఏడు వానకాలం పంటల సాగుకు రైతులు ముందుగానే సిద్ధం అవుతున్నారు. దీనికి తోడు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాల ఇన్ఫ్లో కొనసాగుతుండడం, పోచారం, కౌలాస్ ప్రాజెక్టుల్లో తగినంత నీరు ఉండడంతో వానకాలం పంటల సాగుకు ఢోకాలేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2021 వానకాలంలో కామారెడ్డి జిల్లాలో 4.90లక్షల ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 5,07,800 ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. అందుకు తగినట్లు ప్రణాళిక సిద్ధం చేశారు. వరితో పాటు మక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి, పెసర, మినుము, కంది, చెరుకు, కూరగాయల సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే సాగు పనులకు రైతులు శ్రీకారం చుట్టారు.
నిజామాబాద్ జిల్లాలో..
గత వానకాలం సీజన్లో నిజామాబాద్ జిల్లాలో 4 లక్షల 92 వేల 159 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గత సీజన్తో పోల్చుకుంటే.. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం మరో 15 వేల ఎకరాల్లో పంటల సాగు జరుగనుంది. లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల మేరకు వివిధ ఎరువులు అవసరమని భావిస్తున్నారు. కొంచెం అటు ఇటుగా జిల్లాలో ఈ మేరకు ఎరువుల లభ్యత ఉంది. ఇప్పటికే చాలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఎరువుల బఫర్ నిల్వలు ఉన్నాయి.
గత వానకాలంలో మాదిరిగా ఈసారి కూడా వరి పంటకే రైతులు జై కొడుతున్నారు. వరి పంట కోసం ఇప్పటికే నారుమళ్లు వేశారు. జిల్లాలోని బోధన్, వర్ని తదితర ప్రాంతాల్లో ఈ నెల చివరివారంలో వరినాట్లు ప్రారంభం కానున్నాయి.
గత వానకాలం సీజన్లో జిల్లాలో 3,86,156 ఎకరాల్లో వరి పంటను సాగుచేయగా, ఈసారి కూడా ఆ విస్తీర్ణం మేరకు వరిని సాగుచేస్తారని అంచనావేశారు. ఇందులో సన్నాల సాగే ఎక్కువగా జరుగుతుందని భావిస్తున్నారు. కాగా, సాగునీటి లభ్యత కారణంగా సోయాబీన్ విస్తీర్ణం గతంలో కన్నా తగ్గనుంది. గత వానకాలంలో 75,144 ఎకరాల్లో సోయాబీన్ సాగవగా, ఈసారి 65,556 ఎకరాల్లో సాగువుతుందని అంచనా. జిల్లాలో ఈసారి కందుల సాగు గణనీయంగా పెరుగనున్నది. జిల్లావ్యాప్తంగా గత ఏడాది ఈ పంటను 4,029 ఎకరాల్లో సాగుచేశారు. ఈసారి ఈ పంటను 6,023 ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేశారు. 2,971 ఎకరాల్లో మాత్రమే పత్తి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సాగు చేసే పంటల వివరాలను వ్యవసాయాధికారులు అంచనా వేస్తూ ప్రణాళికను విడుదల చేశారు. అధికారుల అంచనా ప్రకారం జిల్లావ్యాప్తంగా వరి 2.42 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 50 వేలు, జొన్న 295 ఎకరాలు, సోయాబీన్ 55 వేల ఎకరాలు, పత్తి 70వేల ఎకరాలు, వేరుశనగ 70 ఎకరాలు, పెసర 18వేల ఎకరాలు, మినుములు 11వేల ఎకరాలు, కంది 35వేల ఎకరాలు, చెరుకు 9వేల ఎకరాలు, 362 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయనున్నట్లు అధికారులు ప్రణాళికలో పొందుపరిచారు. గత ఏడాది కన్నా ఏడు వానకాలం సాగు విస్తీర్ణం భారీగా పెరగనున్నట్లు అంచనా వేసిన అధికారులు, రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచారు. 72,600 క్వింటాళ్ల వరి విత్తనాలు, 5వేల క్వింటాళ్ల మక్కజొన్న, 118 క్వింటాళ్ల జొన్న, 16,500 క్వింటాళ్ల సోయాబీన్, 2,800 క్వింటాళ్ల పత్తి, 14 క్వింటాళ్ల వేరుశనగ, 1,440 క్వింటాళ్ల పెసర, 880 క్వింటాళ్ల మినుములు, 2800 కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. 65,363 మెట్రిక్ టన్నుల యూరియా, 11,408 మెట్రిక్ టన్నుల డీఏపీ, 8,671 మెట్రిక్ టన్నుల పొటాష్, 35,025 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.