నిజామాబాద్, ఏప్రిల్ 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో శాస్త్రీయత లేని జోనల్ వ్యవస్థతో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఆంధ్రా వ్యక్తులు గంప గుత్తగా వచ్చి ఇక్కడి పోస్టులను కొల్లగొట్టారు. హైదరాబాద్ చుట్టూ అల్లుకుపోయి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా తెలంగాణ యువత నోటికాడి బుక్కను లాక్కున్నారు. దీంతో సమానత్వం దెబ్బతినడం ద్వారా తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్రంగా వెనుకబడి పోయారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, విద్యా అవకాశాల్లో ఎనలేని అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాత జోనల్ వ్యవస్థకు బదులుగా స్థానికత ఆధారంగా ఉద్యోగాలు కల్పించాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ నూతన వ్యవస్థను రూపొందించారు. కొత్త జిల్లాలను ప్రాతిపదికగా చేసుకుని రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లను విభజించారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే శ్రీకారం చుట్టిన ఈ ప్రక్రియకు ఎట్టకేలకు 2021, ఏప్రిల్ 19నాడు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఫలితంగా ఇకపై తెలంగాణ రాష్ట్రంలో పాత జోనల్ సిస్టమ్ కాలగర్భంలో కలవగా… నూతన జోనల్ వ్యవస్థ పురుడు పోసుకోనుంది. ఈ మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి భిన్నంగా మారబోతోంది. మల్టీ జోన్ -1లో ఉమ్మడి జిల్లా చేర్చినప్పటికీ జోన్ల వారీగా పరిశీలించినప్పుడు బాసర జోన్లో నిజామాబాద్, రాజన్న జోన్లో కామారెడ్డి చేరడం విశేషం.
బాసరకు నిజామాబాద్… రాజన్నకు కామారెడ్డి..
సర్కారు కొలువుల భర్తీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి లోని (1) (2) క్లాజ్లను అనుసరించి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్టర్ రిక్రూట్మెంట్) ఆర్డర్ 2018కి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. పోలీసు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలకూ ఈ జోన్ల విధానం వర్తించనుంది. నూతన జోనల్ వ్యవస్థ ఆమోదంతో జోన్ 2 బాసర పరిధిలోకి నిజామాబాద్ జిల్లా చేరనుంది. ఇందులో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు కూడా ఇందులోనే కొనసాగనున్నాయి. జోన్ 3 రాజన్న పరిధిలోకి కామారెడ్డి జిల్లా చేరింది. ఇందులో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలున్నాయి. బాసర జోన్లో నిజామాబాద్కు భౌగోళికంగా సరిహద్దును కలిగి ఉన్న జిల్లాలే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా మాత్రమే సరిహద్దును కలిగి లేదు. రాజన్న జోన్లో కామారెడ్డి జిల్లాకు కరీంనగర్ మినహా మిగిలిన జిల్లాలన్నీ సరిహద్దు ప్రాంతాలే కావడం విశేషం.
సమానత్వం కోసం..
పాత జోనల్ విధానంలో నిజామాబాద్ జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు ఇతర జిల్లాల వారితో కొల్లగొట్టబడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యోగ ప్రకటనలు వచ్చినా… నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారి ప్రాబల్యమే ఎక్కువగా ఉండేది. ఆ ప్రాంతంలో అత్యధికంగా విద్యా అవకాశాలు ఉండడం. మెండుగా కోచింగ్ సెంటర్లు, ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధతకు అవకాశాలు బోలెడు ఉండడం మూలంగా ఇతర ప్రాంతాల వారంతా ఉమ్మడి జిల్లాలోని ఖాళీలను దక్కించుకునేది. ఇకపై ఈ రకమైన అసమానతలకు చోటు లేకుండా కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. చిన్న జిల్లాలతో ఏర్పాటైన జోనల్ వ్యవస్థలో స్థానికులకే ఉద్యోగాలు దక్కనున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలు జరగలేదు. విద్యా పరంగా సైతం ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల్లో రెండు జోన్లు, 10 జిల్లాల విధానం కిందనే వీటిని చేపట్టారు. దీంతో సమానత్వం సాధ్యం కావడం లేదు. కొత్త జోనల్ విధానం ఆమోదం పొందడంతో కొత్త ఉద్యోగ నియామకాలు దీని కిందనే జరుగనున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు తర్వాత ఆర్డర్ టు సర్వ్ విధానంలో ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. నూతన వ్యవస్థ ఆమోదంతో ఇక మీదట జిల్లాలు, జోన్లవారీగా ఉద్యోగుల సంఖ్య ఖరారు కానుంది. దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా నియమితులైన వారికి సైతం జోనల్ కేటాయింపులు సులభం కానున్నాయి.