ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి కోతలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఊపందుకున్న కోతలతో దండిగా ధాన్యం వస్తోంది. ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటున్న ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నది. ధాన్యం దిగుబడి జోరుగా వస్తుండడంతోపాటుగా అకాల వానలతో తడిసిన ధాన్యాన్ని సైతం అధికారులు సేకరిస్తున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం కర్షకుల కన్నీళ్లు తుడుస్తూ అనేక సవాళ్లను అధిగమిస్తూ ప్రభుత్వ సంకల్పాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో గడిచిన నెల రోజులుగా వరి కోతలు మొదలయ్యాయి. దీనికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్లు నారాయణ రెడ్డి, శరత్ ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నారు. పంట సాగుకు అనుగుణంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేకూర్చారు.
కరోనాలో కట్టుదిట్టంగా..
ఉమ్మడి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ధ్యాన్యం సేకరణకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొనుగోలు సమయంలో రైతులు, సిబ్బంది మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచారు. వానకాలంలో ధాన్యం సేకరణ ప్రక్రియకు అనేక సవాళ్లు ఎదురవ్వగా ఉభయ జిల్లాల్లో యంత్రాంగం ధీటుగా పని చేస్తోంది. ఓ వైపు గత యాసంగి ధాన్యం నిల్వలు పూర్తిగా తరలకపోవడం, ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు రావడం, భారీగా కరోనా కేసులు పెరగడం, లాక్డౌన్ అమలు వంటి ఆంక్షల మధ్య సాఫీగా ధాన్యాన్ని సేకరిస్తుండడం ఆషామాషీ వ్యవహారమేమి కాదు. పోలీసులు, రవాణా, పౌరసరఫరాల, వ్యవసాయ, సహకార, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది.
ధాన్యం విక్రయించిన లక్ష మంది రైతులు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మందికి పైగా రైతులు నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించారు. నిజామాబాద్ జిల్లాలో 63వేల మంది రైతుల నుంచి రూ.వేయి కోట్లు విలువ చేసే 5లక్షల 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కామారెడ్డి జిల్లాలో 55,361మంది రైతుల నుంచి రూ.520 కోట్లు విలువ గల 2లక్షల 76వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యంత్రాంగం సేకరించిం ది. నాలుగైదు రోజుల సమయంలోనే పంట విక్రయించిన రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బు లు జమ చేస్తున్నారు. నిజామాబాద్లో రూ.500కోట్లు, కామారెడ్డిలో రూ. 360కోట్లు చెల్లింపులు పూర్తి కావడం విశేషం.
కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి కొనుగోళ్లు
కామారెడ్డి, మే 17 : కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో చేపట్టారు. యాసంగిలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటికే 2.98లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 51వేల మంది రైతుల ఖాతా ల్లో రూ.360 కోట్లు జమ చేశారు. జిల్లా వ్యాప్తంగా 414 గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ చేపట్టారు. ఆయా కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ యంత్రాలు, గోనె సంచులు, టార్పాలిన్లు, ఇతర సదుపాయాలు కల్పించారు. గత వానకాలంలో 3 లక్షల 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈసారి యాసంగిలో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డును బద్దలు కొట్టారు. మరికొన్ని గ్రామాల్లో ఇప్పుడిప్పుడే వరి కోతలు చేపట్టారు. కోతలకు హార్వెస్టర్ల కొరత కూడా ఉండడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తూనే ఉంది. ఈ నెల 21 వరకు కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్ శరత్ ఇదివరకే అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ వరి కోతలు ఆలస్యంగా జరుగుతున్నందున ఈ ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగే అవకాశాలున్నాయి. మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రైతులకు అండగా కొనుగోలు కేంద్రాలు
లింగంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో లింగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్వేవ్ ఉధృతమైనా సిబ్బంది ధైర్యంగా ఉండి రైతులకు అండగా నిలిచారు. కొవిడ్ బారినపడిన, అనారోగ్యంతో బాధపడుతున్న రైతులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి బాసటగా నిలిచారు. కొనుగోలు కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పాజిటివ్ వచ్చినప్పటికీ ప్రత్యామ్నాయంగా సిబ్బందిని నియమించి కొనుగోళ్లు చేపట్టారు.