నిజామాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. గడిచిన కొద్ది రోజులుగా ‘పల్లె ప్రగతి’లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. ఊరంతా ఏకమై వీధులు, నివాసాలు, ప్రజా బాహుళ్య ప్రాంతాలను బాగు చేసుకుంటున్నారు. ఉద్యమంలా కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో అనేక చోట్ల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు సైతం పాలు పంచుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం చొరవ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. ఫలితంగా క్షేత్రస్థాయిలో ఫలితాలు భిన్నంగా దర్శనం ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఒకరిద్దరితో అందరికీ చెడ్డ పేరు వస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఆగమేఘాల మీద పూర్తి చేయగా వాటి చిన్నపాటి లోపాలతో నిరుపయోగంగా కనిపిస్తుండడం విశేషం. మరోవైపు హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ అన్నది కొన్ని చోట్ల మచ్చుకూ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
మొక్కలపై చిత్తశుద్ధి కరువు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో హరితహారం కార్యక్రమంలో, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కల పెంపకానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఇష్టమైన మొక్కలు అందించి ఇంటి ఆవరణలో భారీగా మొక్కలు నాటించారు. వాటి సంరక్షణపై ఇంటి యజమానులకు సూచనలు సైతం చేయడంతో ఇండ్లలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కల పెంపకం సాఫీగానే జరుగుతున్నది. అయితే… గ్రామాల్లో రహదారులపై, వీధుల గుండా నాటిన మొక్కల పరిస్థితి ఘోరంగా మారింది. ఎక్కడ చూసినా మొక్కల సంరక్షణలో శ్రద్ధ కనిపించడం లేదు. ఊరు శివారు ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలను పట్టించుకున్న వారే లేకుండా పోయారు. దీంతో ఆయా మండలాల్లో నాటిన మొక్కలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కానరావడం లేదు. ఇప్పటి వరకు నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల జాడ ఎక్కడన్నది అంతు చిక్కడం లేదు. లక్ష్యానికి అనుగుణంగా గుంతలు తవ్వి మొక్కలు నాటిన చోట ఇప్పుడు వాటి అడ్రస్ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో లోపాలను ఇట్టే బహిర్గతం చేస్తున్నాయి.
సీఎం విజిట్ చేస్తే..
గ్రామాల్లో ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి అక్కడక్కడా అగమ్యగోచరంగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కల సంరక్షణ మాత్రం గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తున్నది. పల్లె ప్రగతిలో ప్రభు త్వం సమకూరుస్తున్న ఫైనాన్స్ కమిషన్ నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్లు కొనుగోలు చేశారు. ట్రాక్టర్, ట్యాంకర్తో మొక్కలకు నీళ్లు పోసేందుకు సిబ్బందిని సైతం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జీపీలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నప్పటికీ పట్టింపు లేని తనంతో కొన్ని గ్రామాల్లో మొక్కల పెంపకం అన్నది ఘోరంగా మారింది. జూన్ 19 అనంతరం ముఖ్యమంతి కేసీఆర్ నేరుగా ఫీల్డ్ విజిట్ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 20వ తేదీన సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాకు వస్తున్నారు. కామారెడ్డిలో ప్రారంభోత్సవాల అనంతరం కేసీఆర్ నేరుగా పల్లె ప్రగతి అభివృద్ధిని తనిఖీ చేస్తే హరితహారం మొక్కల సంరక్షణ తేలిపోయే అవకాశం కనిపించనున్నది. గణాంకాల్లో కోట్లాది మొక్కలు నాటినట్లు చూపించిన ప్రభుత్వాధికారులు అందుకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో మొక్కలను కాపాడడంలో శ్రద్ధ చూపడం లేదన్నది తెలుస్తున్నది.
అధికారులు బిజీబిజీ..
కేసీఆర్ ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను పరిశీలిస్తానని సీఎం చెప్పడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని కార్యక్రమాలకు సంబంధించిన పనులను పూర్తి చేయడంలో బిజీ అయిపోయారు. గ్రామాల్లో ఎలాంటి లోపాలు కనిపించకుండా ఉండేందుకు పంచాయతీ అధికారులు తిప్పలు పడుతున్నారు. పాడైన మొక్కల స్థానంలో ఇతర మొక్కలు నాటడం, రక్షణ కవచం తొడగడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాకుండా సీఎం పర్యటన నేపథ్యంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. అక్కడక్కడా ముగింపు పనులు చేస్తున్నారు. హరితహారంలో నాటిన మొక్కల విషయంలోనే అనేక గ్రామాల్లో సరైన సంరక్షణ అన్నది మచ్చుకూ కనిపించడం లేదు.