ఖలీల్వాడి మే 16:కరోనా నుంచి కోలుకున్న వారిలో గుబులు పుట్టిస్తోంది బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మైకోసిస్). ఈ ఫంగస్ కారణంగా కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా నుంచి కోలుకొని రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉన్నవారికి బ్లాక్ఫంగస్ వచ్చినా అది ఇన్ఫెక్షన్గా మారడం లేదని ఐఎంఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జీవన్రావు, డాక్టర్ విశాల్ తెలిపారు. దీర్ఘకాలిక జబ్బులున్నవారు, ఇప్పటికే శస్త్రచికిత్సలు జరిగినవారు..కొవిడ్ చికిత్సలో మోతాదుకు మించి స్టెరాయిడ్లు వాడితే వారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇదే సమయంలో ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తే విపరీతంగా వృద్ధి చెంది ప్రమాదకరంగా మారుతుంది. ఆక్సిజన్ తీసుకుంటున్న పేషెంట్లకు సైతం బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. షుగర్ లెవల్స్ అత్యధికంగా ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉందని, ముందుగా గమనించి వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలన్నారు.
లక్షణాలు..
బ్లాక్ ఫంగస్ కారణంగా ముఖంలోని ఏదైనా ఒక భాగంలో నొప్పి మొదలవుతుంది. తలనొప్పి, ముక్కుదిబ్బడ, జ్వరం, కంటిచూపు తగ్గడం, పంటి నొప్పి, దవడ, ఛాతి నొప్పి వస్తుంది. ముక్కు నుంచి నల్లని రక్తస్రావం అవుతుంది. కనురెప్పలు వాలిపోవడం. రక్తవాంతులు. కండ్లు అసాధారణంగా ఉబ్బుతాయి. కనుగుడ్ల కదలికలు తగ్గుతాయి.
నివారణ..
కరోనా నుంచి కోలుకున్న తరువాత రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో గ్లూకోజ్ శాతం అదుపులో ఉండేలా చూసుకోవాలి. రోగనిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. మందుల వాడకంలో డాక్టర్ల సలహాలు తీసుకోవాలి.