నవీపేట, మే 16:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.కనీస సౌకర్యాలు లేక అల్లాడిన పల్లెలు నేడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. ఏ గ్రామానికెళ్లినా పచ్చందాలు స్వాగతం పలుకుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం రాంపూర్ గ్రామంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాయి. పది నెలల క్రితమే పల్లె ప్రగతి పనులను వంద శాతం పూర్తి చేసి మండలంలో ఆదర్శ గ్రామంగా ఎంపికై అధికారుల ప్రశంసలు అందుకుంది. జిల్లా అధికారులు సైతం గ్రామాభివృద్ధికి మెచ్చి సర్పంచ్ దొంత రుతు కల్పనకు ఆదర్శ గ్రామ సర్టిఫికేట్ను అందజేశారు. రాంపూర్ జీపీకి అనుబంధ గ్రామంగా ఎల్కే ఫారం ఉంది. గ్రామంలో 1377 జనాభా ఉండగా, 312 ఇండ్లు ఉన్నాయి. వందశాతం ఇంటి పన్నులు చెల్లించిన గ్రామంగా రికార్డు సాధించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతిని విజయవంతం చేసేందుకు గ్రామస్తులంతా ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.12.60లక్షలతో వైకుంఠధామం నిర్మించారు.
అదేవిధంగా వైకుంఠధామంలో పార్కును ఏర్పాటు చేసి దాతల సహకారంతో బెంచీలను వేశారు. రూ.3 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మాణం, డంపింగ్ యార్డు నిర్మించారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. హరితహారంలో భాగంగా రాంపూర్ నుంచి ఎల్కే ఫారం రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రకృతి వనంలో నీడనిచ్చే చెట్లతోపాటు కొబ్బరి చెట్లు ఏపుగా పెరిగాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 8వేలకు పైగా వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా అవుతున్నది.