భీమ్గల్, ఏప్రిల్ 16 :పల్లె ప్రగతిలో భాగంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామం రూపురేఖలు మారాయి. అధికారులు, పంచాయతీ పాలకవర్గం సమన్వయంతో గ్రామాభివృద్ధికి పాటు పడుతున్నారు. గ్రామంలో రూ. 34 లక్షలతో సీసీ డ్రైనేజీలు, రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, రూ.12.60 లక్షలతో వైకుంఠధామం పనులు, రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలో పలురకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. గ్రామసమీపంలో ఉన్న ఆశ్రమంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటున్నది. ప్రకృతివనంలో పండ్ల మొక్కలు అరటి, నారింజ, జామ మొక్కలను పెంచుతున్నారు. ఉదయాన్నే ట్రాక్టర్ గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామ ప్రధాన వీధుల వెంట చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు. గ్రామంలో నాటిన మొక్కలకు ప్రతిరోజూ సిబ్బంది నీరు అందిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో రోడ్డుపై వెళ్లేవారిని ఆకట్టుకుంటున్నాయి. సర్పంచ్ తోట శంకర్ సొంత ఖర్చులతో గ్రామశివారులో బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి వచ్చిన జిల్లా అధికారులు గ్రామంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అందిస్తున్న నిధులతో గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. మండల అధికారుల సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. గ్రామాన్ని జిల్లాలో ఆదర్శంగా నిలిపేందుకు కృషిచేస్తున్నాం. గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే అందరం చర్చించి పరిష్కరించుకుంటున్నాం.
-తోట శంకర్, సర్పంచ్
ఇవీ కూడా చదవండీ…