రాక్ైక్లెంబింగ్, వాటర్ రాపెల్లింగ్, పర్వతారోహణల్లో రాణింపు
అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం
రాపెల్లింగ్లో ప్రపంచ రికార్డు
ఎత్తయిన పర్వతాలను సునాయాసంగా ఎక్కేయగలడు.. జలపాతాలకు ఎదురెక్కగలడు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విన్యాసాలతో అందరినీ సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తున్నాడు మహ్మద్ అలీ అహ్మద్. బోధన్కు చెందిన యువకుడు సాహస క్రీడల్లో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో పతకాలు సాధించాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ అందించిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. ఎంతటి ఎత్తయిన పర్వతాన్ని అయినా అవలీలగా ఎక్కేయడం అహ్మద్కు వెన్నెతో పెట్టిన విద్య. వాటర్ రాపెల్లింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. రాక్ైక్లెంబింగ్లోనూ ప్రతిభ చూపుతున్నాడు.
శక్కర్నగర్, ఏప్రిల్ 14:
బోధన్ మండలంలోని అమ్దాపూర్కు చెందిన మహ్మద్ అలీ అహ్మద్ సాహస క్రీడల్లో ప్రతిభ చాటుడుతున్నాడు. పాల్గొన్న ప్రతి క్రీడలో బహుమతులు సాధించి బోధన్కు వన్నె తెస్తున్నాడు. ఎన్వైకే నిజామాబాద్ ఆధ్వర్యంలో 2015లో ఎడపల్లి మండలంలోని అలీసాగర్లో నిర్వహించిన సాహసక్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిచి సాహస క్రీడలకు ఎంపికయ్యాడు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా అహ్మద్ ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆయనలో ఉన్న ప్రతిభను గుర్తించిన అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ నిర్వాహకులు ప్రోత్సహించారు. హైదరాబాద్లో సాహస క్రీడలపై మరింత శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2, 2015న ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌంట్ కొసియుస్కోను అధిరోహించి జాతీయ జెండాను ఆవిష్కరించాడు. 2018లో లడఖ్లోని స్టాక్ రాంగ్రీ పర్వతాన్ని అధిరోహించాడు. అరకులోని కటీలా వాటర్ఫాల్లో 2019లో నిర్వహించిన వాటర్ రాపెల్లింగ్లో ప్రతిభ చాటి బంగారు పతకాన్ని సాధించాడు. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్లో జయశంకర్ భూపాలపల్లిలోని 200 మీటర్ల లోతైన వాటర్ఫాల్లో నిర్వహించిన రాపెల్లింగ్ పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
అహ్మద్కు
పలువురి ప్రశంసలు
పలు సాహస క్రీడల్లో పాల్గొని అహ్మద్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించే పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రముఖుల నుంచి ప్రశంసా పత్రం, బహుమతులు అందుకుంటున్నాడు. బోధన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత ద్వారా రూ.లక్షల చెక్కును అందుకున్నాడు. ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ యువకుడికి అభినందనలు తెలిపి తనవంతుగా సాయం చేస్తానని ప్రకటించారు. బోధన్లో సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించిన అనురాగ్ జయంతి, తెలంగాణ వక్ఫ్బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీంతోపాటు పలువురు అహ్మద్ను అభినందించారు.