నిజామాబాద్, జూలై 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సిద్ధించేందుకు ముందు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్ష పరిస్థితులు. కాలం కలిసి వస్తుందా? అనుకుంటూ రైతులంతా మొగులు వైపు చూసేది. సాగుకు నీళ్లు లేకపోయేది. ఇటు సాగుతో పాటు జలాశయాలపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు అనేకం కకావికలం అయ్యాయి. ఆనాడు సమైక్య పాలకులు వృత్తిదారుల కష్టాలను పరిష్కరించిన దాఖలాలు లేవు. స్వరాష్ట్రంలో నీటి గోసకు అనతి కాలంలోనే తిప్పలు తప్పడంతో గ్రామాల్లో మత్య్ససిరి విరాజిల్లుతున్నది. సీఎం కేసీఆర్ ఆలోచనల్లో భాగంగా చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించారు. 100 శాతం రాయితీతో చేప పిల్లలు అందించడం ద్వారా వారికి కొండంత భరోసాగా నిలిచారు. ఫలితంగా గ్రామాల్లో మత్స్యకారులకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నుంచి అండ లభించింది. బాగు పడ్డ చెరువుల్లో జల సవ్వడులు కనిపిస్తుండడంతో మత్స్య అభివృద్ధి సాధ్యమైంది. 2021 వానకాలం ప్రారంభం నుంచి దంచి కొట్టిన వానలతో చెరువుల్లో సగానికి ఎక్కువ నీటి నిల్వలున్నాయి. దీంతో సర్కారు ఏటా నిర్వహిస్తున్నట్లుగానే చేప పిల్లల పెంపకానికి సిద్ధమవుతున్నది. ఉమ్మడి జిల్లాలో 1500 చెరువుల్లో 8కోట్ల 60 లక్షల చేప పిల్లలను వదిలేందుకు మత్స్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
భారీ లక్ష్యాలు సిద్ధం…
మత్య్సకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం వంద శాతం రాయితీపై చెరువులు, కుంటల్లో చేప పిల్లలు విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు పలు విడుతలుగా అందజేసిన మత్స్య శాఖ అధికారులు ప్రస్తుతం మరో విడుతకు సిద్ధం అవుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చెరువులు, కుంటలకు కొదవ లేదు. వేలాది జలాశయాలు అందుబాటులో ఉండడంతో మత్స్య అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతంగానూ గుర్తింపు పొందింది. ప్రస్తుతం అన్ని చెరువుల్లోనూ నీళ్లు పుష్కలంగా ఉండడంతో చేప పిల్లల పెంపకానికి మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. చేప పిల్లలను ఉచితంగా ప్రభుత్వమే ఆయా చెరువులకు సరఫరా చేస్తున్నది. ఈ మేరకు లక్ష్యాలను మత్స్యశాఖ అధికారులు సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో 2021 – 22లో 895 చెరువులు, ఒక రిజర్వాయర్లో 5కోట్ల 30 లక్షల చేప పిల్లల విత్తనాలను వదిలేందుకు నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 605 చెరువుల్లో 3కోట్ల 30 లక్షల చేప పిల్లలు పెంచాలని ప్రణాళికలు రచించారు. నిజామాబాద్ జిల్లాలో 249 మత్య్య పారిశ్రామిక సహకార సంఘాలుండగా ఇందులో 16,826 మంది సభ్యులున్నారు. కామారెడ్డి జిల్లాలో 147 మత్స్య సహకార సంఘాలున్నాయి. వీటిలో 13,170 మంది సభ్యులున్నారు.
అక్రమాలకు చెక్ పెట్టేలా…
చేప పిల్లల పంపిణీలో అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. కాంట్రాక్టర్లతో కొమ్ము కాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా నిఘా ఏర్పాటుకు సిద్ధమైంది. నిర్ధిష్ట ప్రమాణాలతో కూడిన చేప పిల్లలను సరఫరా చేయని కాంట్రాక్టర్లకు ఈసారి నోటీసులు పంపించి వివరణ అడగడం, అంతేకాకుండా తప్పు చేస్తే బ్లాక్లిస్టులో పెట్టేందుకు సర్కారు యోచిస్తున్నది. ఇందులో పాత్రధారులుగా తేలితే మత్స్యశాఖ అధికారులపై చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది.వాస్తవానికి కాంట్రాక్టర్లు బ్రీడర్ విత్తనాలను ఒకటి, రెండు చెరువుల్లో పెంచి వాటి పెరుగుదలను గమనించాల్సి ఉంటుంది. అనంతరం వాటి సహాయంతో విత్తును ఉత్పత్తి చేయించి పం పిణీ చేయాలి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇటువంటివేమీ చేయకుండానే అందుబాటులో ఉ న్న నాణ్యతలేని వాటిని అంటగడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాహు, బొచ్చ, కట్ల మూ డు రకా ల విత్తును నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉం టుంది. ఇవి తొందరగా వృద్ధి చెందుతాయి. ప్రతి చెరువులో ఈ మూడు రకాలు వేర్వేరుగా సంచుల్లో అందజేయాలి. మూడు రకాల చేప పిల్లలను ఒకే సంచిలో వేసి చెరువులోకి వదిలేస్తున్నా రు. ఇందు లో అరవై శాతం మృత్యువాత పడుతున్నట్లుగా మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఎదగని చేప పిల్లలను తక్కువ ధరకు సేకరించి చెరువుల్లో వదిలి చేతులు దులుపుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.
మత్స్యకారులపై భారం పడకుండా…
మత్స్యకారుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన చేప పిల్లల పెంపకం కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తున్నది. సంబంధిత వర్గాల నుంచి స్పందన భారీగా ఉండడంతో ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
చేపలే జీవనాధారంగా చేసుకుని బతుకీడుస్తున్న కుటుంబాలను ఆదుకోవాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. తద్వారా చేపల ఉత్పత్తి పెరిగి ఆర్థిక ప్రయోజనం భారీగా ఉంటుందనేది సర్కారు ఉద్దేశం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ల్లో ఆరో విడుతలో చేప పిల్లలను వదిలేందుకు అనువైన నీటి వనరులను మత్స్యశాఖ అధికారులు గుర్తించారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపేందుకు తలపెట్టిన అద్భుతమైన కార్యక్రమం చేప పిల్లల పెంపకం. ఆర్థికంగా చితికి పోయిన కుల వృత్తిదారులకు సర్కారు పెద్దన్నలా అండగా నిలుస్తున్నది. ఉచితంగా పంపిణీ చేసిన చేప పిల్లలను ఎదిగిన తర్వాత అమ్ముకునేందుకు మార్కెటింగ్ సౌకర్యాలను సైతం ముంగిటకు తీసుకువచ్చింది. మత్స్యకారులు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే చేపలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. నాణ్యమైన చేప పిల్లలను గుర్తించి, శాస్త్రీయ పద్ధతిలోనే చెరువుల్లో చేప పిల్లలను వదలాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.