ఖలీల్వాడి (మోపాల్ ), జూలై 13: మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా ఇందూరు తిరుమలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు గాయకురాలు విమలక్క, గో ఆధారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. వ్యవసాయం ఒక పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. గో ఆధారిత వ్యవసాయం భుక్తి కోసమేనని అన్నారు. మనల్ని రక్షించేది, ఆరోగ్యంగా ఉంచేది రసాయన రహిత పంటలేనని అన్నారు. అనంతరం వరినాట్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కబడ్డీ కోచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో బురదలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు నరసింహారెడ్డి, ప్రతినిధి నరాల సుధాకర్, ఎంపీటీసీ రాములు, ఉప సర్పంచ్ రాజేశ్వర్, రవీందర్ యాదవ్, ప్రసాద్, గంగారెడ్డి, గంగాధర్, ప్రదీప్, చిన్నయ్య, నర్సిరెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.