పెరుగుతున్న నిత్యావసర ధరలతోనూ సామాన్యుడు విలవిల
ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
ఖలీల్వాడి, జూలై 13: పెట్రో ధరలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి దడ పుట్టిస్తున్నాయి. సామాన్యుడు పెట్రోల్ కోసం నెలరోజులకు సరిపడా దాచుకున్న డబ్బులు 15రోజులకే సరిపోతున్నాయి. దీంతో జేబుకు చిల్లు పడుతోంది. పెట్రో ధరలతోపాటు నిత్యావసర ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సామాన్యులు విమర్శిస్తున్నారు. అడ్డూఅదుపు లేకుండా ధరలు పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది పేద, సామాన్య వర్గాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడితే, కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర జీతాలతో నెట్టుకొస్తున్న సామాన్యులు పెట్రో ధరలతో ఆర్థికంగా చితికిపోతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే బీజేపీ నాయకులు బంగారం రేటు పెరుగుతుందంటూ దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులకు, గోల్డుకు తేడా కూడా తెలియడంలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాతనే పెట్రోల్ ధర సెంచరీ దాటడంతో ఆటో, కారు డ్రైవర్లు, ద్విచక్రవాహనదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
సామాన్యులపై భారం మోపుతున్నారు
రోజురోజుకూ పెట్రో ధరలతోపాటు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా యి. దీంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్నది. అసలే కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వాహనదారులు కూడా ఆర్థికంగా సతమతమవుతున్నారు.
-మంచాల జ్ఞానేందర్, పెట్రోల్ బంక్ యజమాని