నిజామాబాద్ రూరల్, మే 13 : బైకులను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడు ఎట్టకేలకు నిజామాబాద్ రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. చోరీకి పాల్పడిన యువకుడిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చోరీకి సంబంధించిన వివరాలను నిజామాబాద్ రూరల్ సౌత్ జోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి, ఎస్హెచ్వో లింబాద్రి, టాస్క్ఫోర్స్ ఏఎస్సై రామకృష్ణతో కలిసి విలేకరులకు వివరించారు. మాక్లూర్ మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన కుమ్మరి సాయికుమార్ (23) గత మూడు నెలల నుంచి బైకులను చోరీ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని బషీర్బాగ్, మేడ్చల్, చిక్కడ్పల్లి, మెహదీపట్నం, దుండిగల్ ప్రాంతాల్లో పది బైక్లను అపహరించి తన ఇంట్లో పెట్టుకున్నాడు. నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో ఓ బైక్ను చోరీ చేసి తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ల చోరీకి పాల్పడిన వివరాలను తెలిపాడు. దీంతో అతని ఇంట్లో దాచిపెట్టిన పది బైక్లను రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో లింబాద్రి, టాస్క్ఫోర్స్ ఏఎస్సై రామకృష్ణ, కానిస్టేబుళ్లు కిరణ్గౌడ్, మహేశ్ వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 బైక్లను దొంగిలించిన సాయికుమార్ను గురువారం రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. నిందితుడిని పట్టుకున్న ఎస్హెచ్వో లింబాద్రి, టాస్క్ఫోర్స్ ఏఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్ కిరణ్గౌడ్, మహేశ్ను సీఐ అభినందించారు.