మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కల్వకుంట్ల కవిత
ఉచిత భోజన వితరణ విస్తరణకు ఎమ్మెల్సీ సంకల్పం
త్వరలోనే వ్యవసాయ మార్కెట్లో అందుబాటులోకి అన్నదానం
రైతులు, హమాలీల మేలు కోసం దృష్టి సారించిన కవిత
1,500 మందికి భోజన వసతి కల్పించేందుకు శరవేగంగా ఏర్పాట్లు
మూడున్నరేండ్లుగా ప్రభుత్వదవాఖానల్లో సాగుతున్న నిత్యాన్నదానం
నిజామాబాద్, జూన్ 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ తెలంగాణలోనే విశిష్టమైనది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎంతో మంది రైతులకు ఈ మార్కెట్తో అనుబంధం ఉంది. పసుపు, ఆమ్చూర్ వంటి ప్రాధాన్యమైన పంటల కొనుగోళ్లకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. సీజన్ సమయంలో పంటలు విక్రయించేందుకు నిత్యం దాదాపుగా కనిష్ఠంగా వేయి మంది నుంచి గరిష్ఠంగా 15వందల మంది రైతులు వస్తుంటారు. అన్ సీజన్లో 300 మంది వరకు మార్కెట్ను అవసరాల నిమిత్తం సందర్శిస్తుంటారు. పంటల కొనుగోళ్లు జోరుగా సాగే సమయంలో వీరందరికీ ఆకలి తీర్చుకోవడం కాసింత కష్టమైన పనే. గిట్టుబాటు ధర దక్కించుకునే ఒత్తిడిలో ఆకలినే మరిచిపోతుంటారు. ఇక రెక్కాడితే కానీ డొక్కాడని హమాలీల కష్టాలు అనేకం. చాలీచాలని కూలితో జీవనం సాగించే వీరికి శ్రమించడమే తప్ప కడుపు నింపుకునే సమయం చిక్కదు. సమయానికి ఆహారం లేక పేగులు కాలుతున్నప్పటికీ పని మీదనే వీరి ధ్యాసంతా. ఇలాంటి వారి గోసను కళ్లారా చూసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పెద్ద మనసును మరోమారు చాటుకునేందుకు సిద్ధమయ్యారు. శ్రమజీవులకు అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉచితంగా మధ్యాహ్న భోజన వసతి కల్పించి మరికొద్ది రోజుల్లోనే వందలాది మంది కడుపు నింపబోతున్నారు.
అలుపెరగని ప్రజా సేవా..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజా సేవలో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. నిరంతరం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వారి కన్నీళ్లు తుడుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఇబ్బందులను ఆలకిస్తూ వారికి కొండంత అండగా నిలుస్తున్నారు. గల్ఫ్ సమస్య అయినా, ఆరోగ్య ఇబ్బందైనా, చదువుకు ఆర్థిక అడ్డంకులైనా… ఇలా ఏ సమస్యతో వచ్చినా వారికి సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఆడబిడ్డల ఎదుగుదలకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు. క్రీడలు, సాహిత్యం, సాంస్కృతిక, వైద్య వృత్తిలో రాణించాలనుకునే ప్రతిభావంతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గరి నుంచి వృద్ధుల వరకు అనేక విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. సాయం కావాలని కోరడమే తరువాయి ఎంతో మందికి చేయిచ్చి పైకి లేపుతున్నారు. తన వద్దకు వచ్చే వినతులతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే విన్నపాలను సైతం తనదైన దృష్టితో పరిష్కరిస్తున్నారు. దేశం కాని దేశంలోనూ అరిగోస పడుతున్న గల్ఫ్ బాధితులకు సైతం నేనున్నానంటూ ఎమ్మెల్సీ కవిత తక్షణం చలించి వారికి సాయం చేస్తూ కుటుంబాలకు భరోసాను నింపుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు… వేలాది మందికి మానవతా దృక్పథంతో అందించిన సేవలు ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
మూడున్నరేండ్లుగా అన్నదానం..
పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న సమయంలో కల్వకుంట్ల కవిత తన మనసును కదిలించిన ఓ చిన్న ఘటన ఆధారంగా ఉచిత అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2017, నవంబర్ 10న అన్నార్థుల ఆకలి తీర్చేందుకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. అలా ఒక అడుగుతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం క్రమేణా ఇతర ప్రభుత్వ వైద్యశాలలకు విస్తరించారు. ప్రస్తుతం నిజామాబాద్, బోధన్ సర్కారు దవాఖానల్లో రోజూ వేయి నుంచి 12వందల మందికి ఆహార సదుపాయం ఉచితంగా అందుతున్నది. మూడున్నరేండ్లుగా సొంత ఖర్చుతో ఎమ్మెల్సీ కవిత నిరాటంకంగా సేవ చేస్తున్నారు. రోగుల బంధువుల మేలుకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నడిపించేందుకు ఏకంగా శాశ్వత కిచెన్ షెడ్డును సైతం కవిత ఏర్పాటు చేయించారు. ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు, హమాలీలకు ఉచితంగా రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో ఆయా వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.