జిల్లాలో ముగిసిన పారిశుద్ధ్య కార్యక్రమాలు
డిచ్పల్లి, జూన్ 13: వానకాలం సమీపిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సీజనల్ వ్యాధులను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందుకోసం జిల్లాలోని 537 గ్రామ పంచాయతీల్లో రెండురోజులపాటు పారిశుద్ధ్య నిర్వహణపై చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపకల్పన చేసి గ్రామ పంచాయతీ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేసింది. ఈనెల 3న ప్రారంభమైన ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ముగిశాయి. అతిసారా, డయేరియా, డెంగీ, చికున్గున్యా, మలేరియా, టైఫాయిడ్, కొవిడ్-19 వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు నిర్వహణ కార్యక్రమాలు గ్రామాల్లో విజయవంతం అయ్యాయి. వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో నిర్వహించిన పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలను కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో చందర్ నాయక్, సీఈవో గోవింద్, డిప్యూటీ సీఈవో మర్రి సురేందర్, ఏపీడీ సంజీవ్కుమార్తోపాటు జిల్లాలోని మండలాల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించారు.
గ్రామాల్లో చేపట్టిన పనులు
గ్రామాల్లో ఉదయం పాదయాత్ర నిర్వహించి నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించారు. జీపీ సమావేశం నిర్వహించి రోజువారీ ప్రణాళికలపై చర్చించారు. చేపట్టిన కార్యక్రమాల ఉద్దేశాలను ప్రజలకు తెలిసేవిధంగా చర్య లు చేపట్టారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తూ గ్రామ ప్రజలందరూ వారి ఇండ్ల ఆవరణలో ఉన్న ఉపయోగంలేని డబ్బాలు, కుండలు, పాత టైర్లు, కూలర్లు, నీటి తొ ట్టెలు, కొబ్బరిచిప్పలు, ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని పారబోసి ఆరబెట్టడంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పైప్లైన్, గేట్వాల్, లీకేజీలకు మరమ్మతులు చేపట్టి, గ్రామాల్లో అన్ని ట్యాంకులను శుభ్రం చేశారు. జీపీ కార్యాలయం, పాఠశాలలు, దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టి శుభ్రపర్చారు. అవసరమైన చోట సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కరోనా నిబంధనలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
మురికి కాలువల్లో పూడికను తొలగించి మురికి నీరు, వర్షపునీరును నిరంతరం ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. వర్షపునీరు సులువుగా దగ్గరలోని కుంట, చెరువుల్లోకి ప్రవేశించేవిధంగా చర్యలు తీసుకున్నారు. గ్రామంలోని వీధులు, ప్రధాన రోడ్లను శుభ్రం చేశారు. ప్రధాన రోడ్ల, వీధుల గుండా గుంతలను పూడ్చి నీరు నిల్వ ఉండకుండా చూశారు. దోమల నివారణ చర్యలు చేపట్టారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేరు చేసే విధంగా ప్రజలను ప్రోత్సాహించారు. కాలువల వెంట పూడికతీత, పిచ్చిమొక్కలను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టి అవగాహన కల్పించారు.