మద్నూర్, జూలై 12: దళితులు ఆర్థికంగా ఎదగడానికే సీఎం కేసీఆర్ ‘దళిత సాధికారత’ పథకాన్ని ప్రకటించారని ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. సోమవారం ఆయన మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో ‘దళిత్ ఎంపవర్మెంట్’పై జుక్కల్ నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మేధావులతో సదస్సు నిర్వహించి, వారి సలహాలు, సూచనలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. దళిత సాధికారత సీఎం కేసీఆర్ మానసపుత్రిక పథకమన్నారు. దళిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు మొదటి సంవత్సరం బడ్జెట్లో రూ.12 వందల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలోని వంద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొ ప్పున అందిస్తారని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూ ఉంటుందన్నారు.
ఈ పథకం రూపకల్పన చేస్తున్నారని, ఇందులో భాగంగా సలహాలు, సూచనలు తీసుకొని ముందుకెళ్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎ న్నో ఎస్సీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయగా, జుక్కల్ నియోజకవర్గానికి నాలుగు గురుకుల పాఠశాలలు మంజూ రైనట్లు చెప్పారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. లక్షా ఇరవై ఐదు వేలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలోని దళిత కుటుంబాలు బాగుపడాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమని అన్నారు. దళిత్ ఎంపవర్మెంట్ పథకం నిరుద్యోగ యువతతోపాటు వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటుందన్నారు. నచ్చిన వ్యాపారాలు సైతం చేసుకోవచ్చని అన్నారు. వారు సమాజంలో గౌరవంగా బతకడానికే ఈ పథకం తీసుకువస్తున్నారని వివరించారు. అనంతరం పలువురు వక్తలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఇక్కడి పంటలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, వాటితో చాలా మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మీబాయి, జడ్పీటీసీ సభ్యురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.
పశువులు, గొర్రెలు ఇవ్వాలి
మండలంలో అటవీ భూములు చాలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయంతో దళితులకు పశువులు, గొర్రెల యూనిట్లు ఇవ్వాలి. ఇంకా ఎక్కువ మొత్తంలో ఇస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారు. దళితుల భూములకు సాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తే చాలా బాగుంటుంది.
ఇంట్లో వాళ్లందరూ పనిచేయాలి
దళిత్ ఎంపవర్మెంట్ ద్వారా డబ్బులు వస్తే ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే ఇంట్లో వాళ్లందరూ పనిచేయాలి. సూపర్ మార్కెట్, లేడీస్ ఎంపోరియం, బ్యూటీ పార్లర్, టైలర్ వంటి వ్యాపారం పెట్టుకొని అందరూ అక్కడే పనిచేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం రావాలంటే కష్టం. అందుకే వ్యాపారంపై దృష్టి సారించాలి. ఆదాయాన్ని పొదుపు చేసుకొని, వారి పిల్లలను బాగా చదివించాలి.
-జ్యోతి, టీచర్, దళిత మహిళా సంఘం అధ్యక్షురాలు