నిజామాబాద్ లీగల్, జూలై 12 : వయోవృద్ధుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జగన్నాథం విక్రమ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాసదన్లో సోమవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ప్రసంగించారు. వయోవృద్ధులకు దవాఖానలు, ప్రయాణాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయన్నారు. పోషణ ఖర్చుల కోసం రక్త సంబంధీకుల నుంచి పరిహారాన్ని స్థానిక న్యాయస్థానాలు, రెవెన్యూ, డివిజనల్ అధికారుల ద్వారా చట్టబద్ధంగా కోరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. వయోవృద్ధుల సహాయార్థం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక టోల్ఫ్రీ హెల్ప్లైన్ 14567 ఏర్పాటు చేసిందని తెలిపారు. సంస్థ సభ్యులు రాజ్కుమార్ సుబేదార్, మాణిక్రాజ్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు, తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించారని, చట్టాన్ని ఉపయోగించుకుంటూ మెరుగైన ప్రయోజనాలను పొందాలని సూచించారు. వయోవృద్ధులను సంరక్షించాలని, వారిని పోషించాల్సిన బాధ్యత సంబంధీకులదేనని అన్నారు. బాధ్యతలను మరిచిన వారిని చట్టం క్షమించదని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలు, న్యాయ సేవా సంస్థ సమష్టిగా హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నిలబడుతాయని వారు తెలిపారు.