ఇందూరు, జూలై 12 : పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం జిల్లా, మండల అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రకృతివనాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, గతంతో పోలిస్తే ఈసారి కష్టపడి పనిచేశామని అన్నారు. మిగతా పనులను పూర్తి చేయడంపై శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు చేస్తారని, వందశాతం పనులు పూర్తికావాలన్నారు. ప్రతి గ్రామంలో, పట్టణంలో పరిశుభ్ర వాతావరణం ఉండాలని, పెద్దఎత్తున మొక్కలను నాటాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు పట్టణాల్లో ఖాళీ స్థలం లేకుండా మొక్కలు నాటించాలన్నారు. ప్రతి ఇంటికీ ఆరు చొప్పున మొక్కలు పంపిణీ చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను పూర్తి చేయనివారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న డీఎల్పీవోలు, ఎంపీడీవోలు, పీఆర్ ఏఈ లు, ఆర్అండ్బీ ఏఈలు, పంచాయతీ సెక్రటరీలు గ్రామాల్లో శానిటేషన్పై దృష్టి సారించాలన్నారు. హరితహారంలో భాగంగా అటవీశాఖ సమన్వయంతో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని అన్నారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని, ఏరోజు చెత్త ఆ రోజే తొలగించాలని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి కంపోస్ట్ షెడ్డులకు తరలించాలని ఆదేశించారు.రోడ్లపై చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని, కళాశాలలు, పాఠశాలల ఆవరణలో ఖాళీ స్థలాలను గుర్తించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాల న్నారు. డంపింగ్ యార్డులు, 530కి గాను 529 వైకుంఠధామాలు పూర్తయ్యాయని, నర్సింగ్పల్లిలో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పల్లెప్రకృతి వనాలు లేని చోట వెంటనే స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఫారెస్ట్ అధికారి సునీల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, గోవింద్నాయక్, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.