నిజామాబాద్, మే 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తొలి రోజు సంపూర్ణంగా అమలైంది. బుధవారం ఉదయం 10గంటల నుంచి లాక్డౌన్ ప్రారంభం కావడంతో ప్రజలంతా ఇండ్లకే పరిమితం అయ్యారు. ప్రభుత్వ సూచనలను పరిగణలోకి తీసుకొని ఎవరికి వారు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించారు. అత్యవసర సేవలతో పాటుగా మినహాయింపు ఇచ్చిన రంగాల్లోనే సేవలు కొనసాగాయి. మిగిలిన సేవలన్నీ బంద్ కావడంతో అంతటా వెలవెలబోయిన పరిస్థితులే కనిపించాయి. నిజామాబాద్ నగరం ఉదయం పదిగంటలకే నిర్మానుష్యంగా మారింది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటుగా ముఖ్యమైన ప్రాంతాల్లోనూ ఇదే తీరు స్పష్టంగా కనిపించింది. ఇక నిత్యం జనరద్దీతో కనిపించిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు వెలవెలబోయాయి.
నిర్మానుష్య వాతావరణం..
ఉభయ జిల్లాల ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు సాహసించలేదు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయట కనిపించలేదు. పోలీసులు సైతం ప్రధానరహదారులపై బందోబస్తు నిర్వహించారు. అనవసరంగా తిరుగుతున్న పోకిరీలను మందలించి ఇంటికి పంపించారు. అత్యవసరం పేరుతో వచ్చిన వారికి సహాయకారులుగా నిలిచారు. నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్, నెహ్రూ పార్క్, వర్ని రోడ్డు, పూలాంగ్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, వినాయక్ నగర్ ప్రాంతాల్లో ఎటుచూసినా నిర్మానుష్యమే కనిపించింది. ఆర్మూర్, బోధన్ పట్టణాల్లోనూ జన సంచారం మచ్చుకు కనిపించలేదు. మహారాష్ట్ర సరిహద్దులో చెక్పోస్టుల వద్ద రాకపోకలు పూర్తిగా నిలువరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో లాక్డౌన్తో ప్రజలంతా ఇండ్లలోనే ఉండిపోయారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు ఉమ్మడి జిల్లాల్లోని గ్రామాల్లోనూ లాక్డౌన్ సంపూర్ణంగా అమలైంది. షాపింగ్ మాల్స్, కిరాణా దుకాణాలు, వ్యాపార సముదాయాలు, వైన్ షాపులు గతానికి భిన్నంగా ఉదయం 10గంటల వరకే తెరిచి ఉంచారు. లాక్డౌన్ నిబంధనల మేరకు వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 6గంటలకు తెరిచి పది గంటలకు మూసివేశారు. ప్రజలు తమకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
కట్టడి.. కట్టుదిట్టం..
కొవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ మహమ్మారి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మే 12 బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తొలిరోజు లాక్డౌన్లో ప్రజలు ఇండ్లకే పరిమితం అయ్యారు. పిల్లాపాపలతో కాలక్షేపం చేస్తూ గడిపారు. మరికొంత మంది ఇంటి నుంచే తమ కార్యకలపాలు నిర్వహించుకుంటూ కనిపించారు.