ఆర్మూర్/శక్కర్నగర్/శక్కర్నగర్ (ఎడపల్లి)/రెంజల్/ రుద్రూర్, జూలై 11 : ఈ నెల ఒకటిన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు శనివారంతో ముగిసినప్పటికీ పలుచోట్ల ఆదివారం సైతం నిర్వహించారు. ఆర్మూర్ బల్దియా పరిధిలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగాయి. పలు కాలనీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్ల పక్కన ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పవన్, టీఆర్ఎస్ నాయకుడు ఎండీ ఫయాజ్, కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, వార్డుల ప్రత్యేకాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
బోధన్ పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. శక్కర్నగర్, రామ్నగర్ కాలనీలో కాలువల్లో పూడిక తీశారు. రోడ్ల పక్కన పిచ్చిమొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దేగావత్ దూప్సింగ్నాయక్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నామని తెలిపారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.
ఎడపల్లి మండల కేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలువకుండా జేసీబీ ద్వారా కచ్చా కాలువలు తవ్వి నీటిని మళ్లించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా, సిండికేట్ బ్యాంక్ వద్ద, బోధన్- నిజామాబాద్ రహదారి పక్కన రోడ్లపై నీరు నిల్వడంతో వాటిని పంచాయతీ అధికారులు తొలగింపజేశారు.
కేజీబీవీలో హరితహారం..
రెంజల్ మండల కేంద్రంలోని కేజీబీవీలో హరితహారం కార్యక్రమం నిర్వహించి పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయినులు మొక్కలు నాటారు. స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో తవ్వించిన గుంతల్లో పండ్లు, నీడనిచ్చే మొక్కలను నాటినట్లు గ్రామ ప్రత్యేకాధికారిణి శ్యామల తెలిపారు.
హరితహారంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని చౌడేశ్వరి ఆలయం ప్రాగణంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాగరాజ్, గణేశ్, రాజేశ్, సురేశ్, యోగి, గంగారాం, భూషణం తదితరులు పాల్గొన్నారు.