నిజామాబాద్, జూన్ 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించ బోమని, బాధ్యులు ఎంతటివారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు తయారు చేసినా, సరఫరా చేసినా, విక్రయించినా వారిపై ఉక్కుపాదం మోపాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ సైతం ఈ విషయంలో కఠినంగా ఉన్నారన్నారు. శుక్రవారం నిజామాబాద్ కలెక్టరేట్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, సహకార, మార్క్ఫెడ్, తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కరోనా కాలంలోనూ ధాన్యం సేకరణ..
కరోనా కష్టకాలంలోనూ రైతు పండించిన ప్రతి గింజ నూ ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. మహమ్మారి విస్తృతి సమయంలోనూ ప్రాణాలు పణంగా పెట్టి పౌరసరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా, పోలీసు శాఖలు సమన్వయంతో రైతులు పండించిన పంటను సేకరించేందుకు కృషి చేశారని మంత్రి కితాబునిచ్చారు. రైతుబంధు కోసం ప్రభుత్వం ఏటా రూ.14 కోట్లను, రెండు లక్షల వ్యవసాయ బోర్ల కోసం రూ.28వేల కోట్లను ఖర్చు చేస్తున్నదన్నారు.
ఐదు లక్షల ఎకరాల్లో పంటల సాగు..
నిజామాబాద్ జిల్లాలో వానకాలంలో 5లక్షల 7వేల 800 ఎకరాల సాగు అంచనాకుగాను 77వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా 24,350 మె ట్రిక్ టన్నులు స్టాక్ ఉందని మంత్రి చెప్పారు. డీఏపీ 16,610 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1897 బఫర్ ఉన్నదన్నారు. ఎంవోపీ 10,402 మెట్రిక్ టన్నులకు గాను 2,722 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువు 33,878 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 21,415 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వివరించారు. విత్తనాల స్టాక్ సరిపడా ఉందన్నారు. గత వానకాలంలో 53లక్షల ఎకరాల్లో, యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయడం ద్వారా మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు. ఈ లాభాలతో దేశం, రాష్ట్రం యొక్క జీడీపీ కూడా పెరిగిందన్నారు. వరి పంట సాగులో, ఉత్పత్తి సాధించడంలో పంజాబ్ రాష్ర్టాన్ని తెలంగాణ దాటిందన్నారు. సమీక్ష లో కలెక్టర్ నారాయణ రెడ్డి, డీసీపీ అరవింద్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, డీఎస్వో సింహాచలం పాల్గొన్నారు.
సాగుకోసం పకడ్బందీ ప్రణాళిక…
వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు విత్తనాలు, ఎరువులు, మందులు అందుబాటులో ఉంచే విధంగా పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. నకిలీ విత్తనాలు విక్రయించకుండా దుకాణాలపై టాస్క్ఫోర్స్ టీమ్లతో దాడులు చేయిస్తున్నాం. రైతులకు ఏ సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు టాస్క్ఫోర్స్ బృందాల ద్వారా 223 తనిఖీలు చేపట్టాం.