మాక్లూర్, మే 11: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రగతితో గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో పయణిస్తున్నాయి. సర్కారు మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లో మౌలిక వసతులను సమకూర్చుకుంటున్నాయి. ఏండ్ల కాలంగా వెనుకబడిన గ్రామాలు ఇప్పుడు అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. పల్లెప్రగతిని నిధులను చక్కగా వినియోగించుకొని సుందరంగా తయారయ్యింది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామం. గతంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు చేయడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. రూ.12.60 లక్షల నిధులతో వైకుంఠధామం నిర్మించడంతో ఆఖరు మజిలీకి ఇబ్బందులు తొలగిపోయాయి.
పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. రాబోయే హరితహారం కోసం నర్సరీలో మొక్కలు పెంచుతున్నారు. ప్రభుత్వం అందించిన ట్రాక్టర్తో ప్రతి రోజూ మొక్కలకు నీరు పడుతూ అవి ఎండిపోకుండా కాపాడుతున్నారు. గ్రామంలో ఇండ్ల నుంచి ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామానికి మరింత శోభను తీసుకువచ్చాయి. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం, రామాలయం వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, స్తంభాలకు అమర్చిన ఎల్ఈడీ బల్బులతో రాత్రి సమయంలో గ్రామం జిగేల్ మంటున్నది. జీపీకి విడుదలైన ప్రత్యేక నిధులతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది.
‘పల్లెప్రగతి’తోనే అభివృద్ధి..
పల్లెప్రగతిలో భాగంగా విడుదల చేస్తున్న నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల సహకారం మరువలేనిది. పల్లెప్రగతి ద్వారా ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.