హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక వ్యాయామంతో పాటు మంచి ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. చాలామంది కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ రాగానే సంతోషంలో ఆరోగ్యంపై దృష్టిపెట్టడం మరిచిపోతున్నారు. వైద్య నిపుణులు ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కొవిడ్ నెగెటివ్ వచ్చిన తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామం చేయాలి తదితర విషయాలపై ముంబైకి చెందిన న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ శాలినీ భార్గవ్ ‘నమస్తే తెలంగాణ’ కు వివరించారు.
వారంపాటు విశ్రాంతి అవసరం
కొవిడ్ నెగెటివ్ వచ్చాక శరీరం పూర్తిగా కోలుకొనేందుకు కనీసం వారంపాటు పూర్తి విశ్రాంతి అవసరం. తగినంత నీరు తాగుతూ హైడ్రేటెడ్గా ఉండాలి. రోజులో కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. దీంతోపాటు కొబ్బరినీరు, నిమ్మరసం, గ్లూకోజ్ తరచూ తాగుతూ ఉండాలి.
డైట్ ఫాలోఅవ్వాలి
వ్యాయామంతో పాటు సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, విటమిన్లు, తగినపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి. పచ్చని కూరలు ఎక్కువగా తినాలి. ఉసిరి, నిమ్మ, సంత్ర తదితర విటమిన్ సీ ఉండే పండ్లు అధికంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు పంచదార వాడకూడదు. దీనికి బదులు న్యాచురల్ షుగర్ ఉండే పండ్లు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.
మానసిక ఆందోళనకు దూరంగా ఉండాలి
కొవిడ్ రికవరీ అనంతరం ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా ఎంతో అవసరం. కరోనా వచ్చిన వారిని చూస్తూ చాలామంది మానసికంగా ఆందోళన చెందుతుంటారు. అందుకే ఖాళీ సమయంలో మనకు తోచిన పని ఏదైనా చేస్తూ ఉండాలి. వ్యాయామంతో సైతం పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. దీనివల్ల మెదడు స్టేబుల్గా ఉంటుంది.
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలి
కొవిడ్ ప్రభావం అన్నింటికన్నా ఎక్కువ ఊపిరితిత్తులపై ఉంటుంది. అందుకే అవి ఆరోగ్యంగా ఉండేలా తగిన వ్యాయామం చేయాలి. ఇందుకు యోగా, ప్రాణాయామం ఉత్తమమైనవి. ప్రాణాయామంతో శ్వాసకు సంబంధించిన నాడులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. అలా అని నెగెటివ్ వచ్చిన వెంటనే వ్యాయామం మొదలుపెట్టకూడదు. దీనివల్ల ఆరో గ్యం మెరుగయ్యేకంటే దెబ్బతినే అవకా శం ఉంటుంది. వైద్యుల సలహా తీసుకోవాలి. బీపీ, షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవాలి. అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే వ్యాయామం మొదలుపెట్టాలి.