చందూర్, ఏప్రిల్ 11 :నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని కారేగాం తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. మురికి కూపాలుగా మారిన తండాలను ప్రగతి బాట పట్టించడం కోసం సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో ప్రస్తుతం గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. హరితహారంలో భాగంగా గ్రామంలో నాటిన మొక్కలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపడుతుండడంతో స్వచ్ఛగ్రామం దిశగా అడుగులు వేస్తున్నది. గ్రామస్తులు సైతం అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతున్నారు. సకల సౌకర్యాలతో వైకుంఠధామాన్ని పూర్తి చేశారు. గ్రామంలో డ్రైనేజీలను నిర్మించడంతో మురికి నీరు రోడ్లపై కనిపించడం లేదు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతోనే..
నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఒక ఎత్తయితే దీనికి తోడు ప్రభుత్వం గ్రామాభివృద్ధికి పుష్కలంగా నిధులు కేటాయించడం నా అదృష్టం. గతం తండాలో చాలా సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతుండేవారు. ప్రస్తుతం గ్రామస్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించాం. మా గ్రామంలో ప్రగతి పథంలో పయనించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతున్నారు.
-దేవీసింగ్, సర్పంచ్