వర్గల్/తూప్రాన్ రూరల్, ఏప్రిల్10: కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఆరోరోజూ ఆదివారం పరుగులు తీశాయి. ఈ ఆరు రోజుల్లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాలుగు చెరువులు, నాలుగు చెక్డ్యామ్లను గంగమ్మ నింపింది. అపర భగీరథుడు, సీఎం కేసీఆర్ ఈనెల 6న సిద్దిపేట జిల్లా అవుసులపల్లి వద్ద సంగారెడ్డి అప్టెక్ తూం వద్ద గోదావరి జలాలను వదిలిన సంగతి తెలిసిందే. ఆరు రోజులుగా వర్గల్ మండలంలోని చౌదర్పల్లి బంధం చెరువు ,వర్గల్ పెద్ద చెరువు, శాకారం ధర్మాయి చెరువు, అంబార్పేట ఖాన్ చెరువులను నిండాయి. దీంతో పాటు వర్గల్ మండలంలోని నాలుగు చెక్డ్యామ్లు నిండాయి. ఆదివారం మెదక్ జిల్లాలో గోదావరి జలాలు ప్రవేశించాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ఆదివారం 9 చెక్డ్యామ్లను గోదారమ్మ నింపింది. ఆదివారం మొత్తం 16 కిలోమీటర్ల దూరం గోదారమ్మ ప్రవేశించింది.