కోటగిరి, ఏప్రిల్ 11 :మనిషి దైనందిన జీవితంలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఉరుకుల పరుగుల జీవన గమనంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆహారపు ఆలవాట్లతో ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. వేసవి కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వేసవి తాపాన్ని తగ్గించే దోస కాయలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
వేసవి ఫలాలు..
వేసవి కాలంలో ఎక్కడ చూసిన దోస, కీర దోస, తాటిముంజలు, కర్బూజ, సపోటా లాంటి ఫలాలు విరివిగా లభిస్తాయి. ఈ ఫలాలకు గిరాకీ సైతం బాగానే ఉంటుంది. వేసవి సీజన్లో దోసకాయల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది. వేసవి సీజన్పై ఆధారపడి వందలాది మంది వ్యాపారం సాగిస్తున్నారు. మన దగ్గర కీరదోస, సపోట, పుచ్చకాయల సాగు అంతంత మాత్రంగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి అవుతుంది. పక్క జిల్లాల నుంచి దిగుబడి అయిన దోస, సపోట, పుచ్చకాయలను విక్రయిస్తున్నారు.
అన్ని వర్గాలకు అందుబాటులో..
అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ధరలో దోసకాయలు లభిస్తున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ కాయలను వేసవి కాలంలో ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ధర తక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా దోసలో ఉన్నాయి.
దోసకాయతో ఎన్నో ప్రయోజనాలు..
ప్రతి రోజూ భోజన రెసిపీలతో కీరదోస కనబడుతుంది. ఇక స్టార్ హోటళ్లలో కచ్చితంగా వాడుతున్నారు. దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో ఈ కాయను తీసుకోవడం ద్వారా తాపం తీరుతుంది. శరీరంలో ఉన్న వేడిని బయటికి పంపిస్తుంది. ఎండదెబ్బ తగలకుండా ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపించే గుణం దోసలో ఉంది. దీంతో వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఆహారంలో దోసను చేర్చుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు.