ముప్కాల్/ ఏర్గట్ల, జూలై 10 : రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యా కే కరెంటు కష్టాలు దూరమైనట్లు తెలిపారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వెంచిర్యాల్లో రూ. కోటీ 20 లక్షలతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ ను ఎమ్మెల్సీ రాజేశ్వర్తో కలిసి ప్రారంభించారు. రెంజర్లలో రూ.24.80 లక్షలతో చేపట్టనున్న పీఏసీఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఏర్గట్ల, తాళ్లరాంపూర్ శివారులోని గుట్ట వద్ద చెక్డ్యాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వేముల మాట్లాడారు. తెలంగాణలో కరెంటు కోసం రైతులు 60 ఏండ్లు కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు.
వారి కష్టాలు తెలిసి రాష్ట్రం కోసం కొట్లాడిన కేసీఆరే సీఎం కావడంతో నేడు 24 గంటల కరెంటుతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతులకు కరెంటు ఇవ్వడానికి నిద్రాహారాలు మాని పనిచేశారన్నారు. దాని ఫలితమే ఇప్పుడు ఉచిత కరెంటు అని పేర్కొన్నారు. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఆ బాధలను రైతులు మర్చిపోలేరన్నారు. ఇప్పుడు కరెంటు కష్టాలు లేవన్నారు. ఇంత మార్పు తెచ్చిన కేసీఆర్, టీఆర్ఎస్, రైతుల సంతోషమే ధ్యేయమే పనిచేస్తున్నవారికి అండగా నిలువాలని కోరారు. బాల్కొండ నియోజక వర్గం కరెంటు కష్టాలకు నిలయంగా ఉండేదన్నారు.తాను వచ్చాక సీఎం కేసీఆర్ సహకారంతో 18 కొత్త సబ్ స్టేషన్లు నిర్మించి, వందల సంఖ్యలో టాన్స్ఫార్మర్లు మంజూరు చేయించామన్నారు. సీమాంధ్ర పాలకులు వివక్ష చూపడంతో తెలంగాణలో రైతులు సుమారు 25 వేల కోట్ల తమ సొంత ఖర్చుతో 24 లక్షల బోరు బావులు వేసుకున్నారని గుర్తుచేశారు. కరెంటు లేక ఈ లక్షలాది బోరు బావులు వృథాగా మారితే సరి పడా కరెం టు ఇచ్చి లక్షలాది బోరు బావులకు నీరు అందిందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. రెంజర్ల, వెంచిర్యాల్ గ్రామంలోని ఇందిరమ్మకాలనీలో డ్రైనేజీల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ప్రతిపక్షాలపై వేముల ఫైర్
కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్యప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారన్నారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి బండి సంజయ్, రేవంత్రెడ్డికి లేదన్నారు. వారు సీఎం కేసీఆర్ కాలిగోటికి సరిపోరని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అభివృద్ధిలో పోటీ పడాలన్నారు. సమైక్య పాలకులు పేదలకు ఇండ్ల నిర్మాణాలు అని చెప్పి ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. వారు పేదల కోసం నిర్మించిన ఇండ్ల లెక్కలు పక్కాగా చూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని మంత్రి సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేసే ముందు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయేమో ఒక్కసారి తెలుసుకోవాలని సూచించారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అధికారాన్ని గుంజుకుంటానని అంటున్నారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన ఆయన దొంగ అని పేర్కొన్నారు. అధికారం గుంజుకుంటే రాదని, అది తెలంగాణ ప్రజలు కేసీఆర్కు ఇచ్చారన్నారు. మతి భ్రమించి మాట్లాడవద్దని హితవుపలికారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు వారిని నమ్మేపరిస్థితిలో లేరన్నారు.