లాక్డౌన్ సడలింపుతో ఉదయం 6 నుంచిసాయంత్రం 5 గంటల వరకు దుకాణాల నిర్వహణ
సాయంత్రం 6 నుంచిపోలీసుల బందోబస్తు
నాగిరెడ్డిపేట్/లింగంపేట/ దోమకొండ/బీబీపేట్, జూన్ 10 : కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ సడలింపు సమయాన్ని పెంచింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు ఇవ్వడంతో రోడ్లపై సందడి కనిపించింది. వ్యాపారులు 5 గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచారు. సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగింది. మండలకేంద్రంలో దుకాణాలను ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచారు. సాయంత్రం 6 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
లాక్డౌన్లో సడలింపు ఇవ్వడంతో లింగంపేట మండల కేంద్రం సందడిగా మారింది. నెల రోజుల అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు మండల కేంద్రంలో జన సంచారం కనిపించింది. రెండు రోజుల క్రితం వర్షాలు కురవడంతో రైతులు వానకాలం పంటల సాగు పనులు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల కోసం మండల కేంద్రానికి తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మండల కేంద్రంలో సందడి నెలకొంది.
దోమకొండ మండలకేంద్రంలో కొనసాగిన లాక్డౌన్ను ఎస్సై రాజేశ్వర్గౌడ్ గురువారం పర్యవేక్షించారు. దోమకొండ మండలకేంద్రంలో ఐదు గంటల తర్వాత దుకాణాలను మూసివేయాలని వ్యాపారులకు సూచించారు. ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు నిర్వహించారు.
బీబీపేట్ మండలంలో లాక్డౌన్ కొనసాగింది. మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో ఎస్సై మహేందర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో బయటతిరగవద్దని, సరైనా కారణం లేకుండా రోడ్లపై తిరిగితే వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.