పూర్తయితే ప్రతి ఎకరానికీ నీరు
మంచిప్ప భూ బాధితులకు పరిహారం ఇస్తాం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి
ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి మెంట్రాజ్పల్లి పంప్హౌస్ పనుల పరిశీలన
డిచ్పల్లి, జూన్ 9: దేశంలోనే అత్యున్నత టెక్నాలజీతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్యాకేజీ-21 ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామ శివారులో చేపడుతున్న పంప్హౌస్ పనులను రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి బుధవారం పరిశీలించారు. పంప్హౌస్ నుంచి క్షేత్రస్థాయిలో పంట పొలాలకు నీరందించే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ 21 ప్యాకేజీలో భాగంగా కెనాల్ ద్వారా సాగునీరు సరఫరా చేస్తే రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం కేసీఆర్ గుర్తించి, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా భూగర్భం నుంచే పైప్లైన్ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించనున్నామని తెలిపారు. ఇజ్రాయిల్ తరహాలో ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్యాకేజీ 21తో నిజామాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అంది బీడులు బారిన భూములన్నీ సాగులోకి రానున్నాయని అన్నారు.
ఈ సీజన్లో పైలెట్ ప్రాజెక్టుగా 20వేల ఎకరాలకు సాగునీరందించి రైతులకు ఇబ్బందుల్లేకుండా చూస్తామన్నారు. ప్యాకేజీ-21 ద్వారా మంచిప్ప చెరువు నిర్మా ణం జరుగుతోందని ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన భూబాధితులకు పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేసి మంచిప్ప రిజర్వాయర్ కెపాసిటీని పెంచి నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలుస్తుందని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. పనులను త్వరలోనే పూర్తి చేసి దేశ చరిత్రలో నిలిచేలా చేస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా బడ్జెట్లో రూ.1600కోట్లను కేటాయించడంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో మంచిప్ప రిజర్వాయర్, కాళేశ్వరం-21 ప్యాకేజీకి నిధులు కేటాయించడం రూరల్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మో హన్, డిచ్పల్లి జడ్పీటీసీ దాసరి ఇందిర, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.
రైతులు సంతోషంగా ఉన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21 ప్యాకేజీలతో నిజామాబాద్ జిల్లా రైతులు సంతోషంగా ఉన్నారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రాజెక్టులో భాగంగా రైతులు భూములు కోల్పోతున్నారని ఎమ్మెల్సీ కవితతో కలిసి సీఎం కేసీఆర్కు వివరించామన్నారు. అండర్ గ్రౌండ్ పైప్లైన్ ద్వారా సాగునీటి సరఫరా విషయాన్ని వివరించగా పెద్ద మనసుతో మరో రూ.1100 కోట్లను మంజూరు చేశారన్నారు.
30శాతం ఫిట్మెంట్ శుభపరిణామం
ఇందూరు, జూన్ 9 : ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ను రాష్ట్ర కేబినెట్ ఆమోదించడంపై హర్షిస్తూ ఉద్యోగులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పేర్కొన్నారు. బుధవారం పీఆర్టీయూ నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్, నాయకులు పీ.మోహన్రెడ్డి, ఎన్వీ కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చిలుక శ్రీనివాస్, ఆర్మూర్, నిజామాబాద్ నార్త్, నవీపేట్, బోధన్, మోపాల్, రుద్రూర్ మండలాల నాయకులు కిషన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, హన్మారెడ్డి, శంకర్, రవీందర్రెడ్డి, రవినాయక్, సుధీర్, శ్రీరాం, టి.ప్రవీణ్, ఖుర్షీద్ పాల్గొన్నారు.