ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8 : గ్రామం చిన్నదే అయినా, ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో పరిష్కారం లభించింది. దాతలు కూడా సహకారం అందించడంతో ఊహించని రీతిలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో స్థలం అందుబాటులో ఉండడంతో గ్రామస్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించారు. ‘పల్లె ప్రగతి’ నిధులతో పాటు, దాతలు అందించిన సహకారంతో పలు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా సుమారు 600 పైగా మొక్కలు నాటారు. ఎడపల్లి సింగిల్విండో అధ్యక్షుడు పోల మల్కారెడ్డి అందించిన సహకారంతో డ్రిప్ సిస్టం ఏర్పాటు చేశారు. గ్రామ శివారులో హరితహారం పథకంలో భాగంగా సుమారు రెండువేలకు పైగా మొక్కలు నాటారు. గ్రామంలో పెద్దల కాలం గుర్తుకు వచ్చేలా రెండు చోట్ల రచ్చబండలను నిర్మించారు. రూ.10లక్షలతో గ్రామంలో శ్మశాన వాటికను ఏర్పాటు చేసి వివిధ రకాల అభివృద్ధి పనులతో పాటు, హరితవనం తలపించేలా వివిధ రకాల మొక్కలు నాటారు. కంపోస్ట్ షెడ్డు నిర్మించి కావాల్సిన ఎరువులను తయారు చేసి వాటిని వినియోగించుకుంటున్నారు. గ్రామంలో అవసరమైన చోట సీసీ రోడ్లను నిర్మించారు. ‘పల్లె ప్రగతి’లో భాగంగా వడ్డేపల్లి ఆదర్శ గ్రామంగా ఎంపికైంది.
ఆదర్శంగా ‘పల్లె ప్రకృతి’ వనం..
గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ‘పల్లె ప్రకృతివనం’ ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లె ప్రకృతివనంలో వివిధ రకాల పూలు, నీడనిచ్చే మొక్కలను పెంచారు. దాత సహకారంతో చిన్నపిల్లల కోసం ఆట పరికరాలు ఏర్పాటు చేశారు.
ఇవీ కూడా చదవండీ…
బెస్ట్ హెల్త్కేర్ స్పెయిన్.. ఎందుకంటే!
కర్ణాటకలోని ఏడు నగరాల్లో 10 నుంచి నైట్ కర్ఫ్యూ