ఎల్లారెడ్డి రూరల్, ఏప్రిల్ 8 : దేవుడు వరమిచ్చినా – పూజారి కరుణించలేదన్నట్లుగా మారింది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ వైకుంఠధామం పనులు. జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఎంత ఒత్తిడి తెచ్చినా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కొన్ని జీపీలలో లక్ష్యం నీరుగారిపోతున్నది. మాచాపూర్ పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతున్నది. ఊరికి దూరంగా ఉన్న చిన్నపాటి కుచ్చను ‘పల్లెప్రగతి పనులకు’ ఎంచుకోవడంలోనే అధికారులు పొరపాటు చేశారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అదే కుచ్చపై వైకుంఠధామం, కంపోస్ట్షెడ్, డంపింగ్యార్డ్, కోతుల ఆహారశాలను ఏర్పాటుచేశారు. వైకుంఠధామం పనులు త్వరగా ముగించాలని కాంట్రాక్టర్కు అప్పజెప్పినా ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. బర్నింగ్పాయింట్ పిల్లర్లకే పరిమితమైంది. స్నానపు గదులు మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. ఇటీవల పనులు పూర్తి చేయాలని అధికారుల నుంచి ఒత్తిడి పెరిగింది. పనుల కోసం తెచ్చిన ఇసుక పూర్తిగా మట్టిలా ఉందని, అభివృద్ధి పనుల్లో ఇలాంటి ఇసుక వాడితే నిర్మాణాలు త్వరలోనే దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వం పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నా నాణ్యత విషయంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పనులు నాణ్యతతో త్వరగా పూర్తయ్యేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
త్వరలో పనులు ప్రారంభమవుతాయి…
వైకుంఠధామం పనులు ఆగిపోయిన మాట వాస్తవమే. పనులు త్వరగా పూర్తి చేయాలని నెలన్నర క్రితమే కాంట్రాక్టర్కు సూచించాం. మెటీరియల్ దొరక్కపోవడంతో పనులు నిలిచిపోయాయి. అధికారుల ఒత్తిడి పెరిగిన దృష్ట్యా పనులు త్వరలో ప్రారంభించి, ముగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించాం. పనులు నాణ్యతతో త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.
-దాసరి పోచమ్మ, సర్పంచ్.
ఇవీ కూడా చదవండీ…
పూణేలో కొత్తగా 12,090 కరోనా కేసులు.. 70 మరణాలు
కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్.. ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
మహారాష్ట్రలో శరవేగంగా పెరుగుతున్న కరోనా కేసులు