సదాశివనగర్, మే 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పనులతో అభివృద్ధి బాటలో పయనిస్తోంది సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామం. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తూ అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు. గతంలో గ్రామానికి వెళ్లాలంటే బీటీ రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సదాశివనగర్ మండల కేంద్రం నుంచి ధర్మారావుపేట్ మీదుగా అమర్లబండ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. గ్రామంలో 236 ఇండ్లు ఉండగా 230 మరుగుదొడ్లు నిర్మించారు.
వీధుల్లో స్తంభాలకు 48 ఎల్ఈడీ బల్బులను అమర్చడంతో రోడ్లన్నీ మిరుమిట్లు గొలుపుతున్నాయి. విలేజ్ నర్సరీలో 10వేల మొక్కలను పెంచుతున్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 950 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలు నాటి పెంచడంతో గ్రామస్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రగతిలో ప్రభుత్వం నిధులు కేటాయించడంతో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్ట్ షెడ్, విలేజ్ నర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులు పూర్తి చేసి అమర్లబండ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది.
ప్రగతి నిధులతో అభివృద్ధికి బాటలు వేశాం..
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా నిధులు మంజూరు చేయడంతో గ్రామంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేశాం. గతంలో ప్రభుత్వ నిధులు లేక గ్రామం అభివృద్ధి చెందలేదు. విలేజ్ నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాం.
-కొత్తూరి లతారాజేశ్వర్, సర్పంచ్