నిజామాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ల్లో ఉధృతంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దును కలిగి ఉన్న ఉమ్మడి జిల్లాను వైరస్ ముప్పు తీవ్రంగా వేధిస్తున్నది. సరిహద్దు ప్రాంతాలకు చెందిన మరాఠా ప్రజలంతా చికిత్స కోసం తెలంగాణ ప్రాంతంలోని దవాఖానలకు, బంధువుల ఇండ్లకు, సొంతూర్లకు రావడంతో వైరస్వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ ఇతర మార్గాల గుండా గుట్టుగా వచ్చిన వారు అధికమే. ఇలా మహారాష్ట్ర నుంచి ముంచుకొచ్చిన కరోనా సెకండ్ వేవ్ ముప్పుతో ఉమ్మడి జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతుండగా ప్రభుత్వ యంత్రాంగం కరోనా కట్టడి చర్యలను దీటుగా చేపడుతున్నది. ఒక ప్రాంతంలో పాజిటివ్ కేసు వెలుగుచూసిన వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో పురపాలక సంఘాలు సైతం ప్రధానవీధులు, వ్యాపా ర, వాణిజ్య కేంద్రాలు, రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రాంతాల్లో రోజుకు మూడుసార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలో 6వేల లీటర్ల హైపోక్లోరైట్ ద్రావణాన్ని ట్రాక్టర్ల ద్వారా పిచికారీ చేసేందుకు చర్యలు చేపట్టగా, ప్రతి డివిజన్ పరిధిలో పారిశు ద్ధ్య కార్మికుడి ద్వారా 20 లీటర్ల డబ్బాలతో ఇండ్ల పరిసరాల్లో రసాయనాలను పిచికారీ చేయస్తున్నారు.
ప్రాణాలను పణంగా పెడుతున్న కార్మికులు
నిజామాబాద్ జిల్లాలోని 29 మండలాల పరిధిలో 530, కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, భీమ్గల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వందలాది మంది పారిశుద్ధ్య కార్మికులున్నారు. ఉభయ జిల్లాల్లో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో అప్రమత్తమయ్యారు. పట్టణాల నుంచి పల్లెలకు వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. నిత్యం తడి, పొడి చెత్తను సేకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ మురుగు కాలువలను శుభ్రం చేసేలా, చెత్తను తొలగించేలా అధికారులు చూస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. వీధులు శుభ్రంగా ఉండేలా పంచాయతీ పాలకవర్గాలు చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు.
వారి హెచ్చరికలతో పారిశుద్ధ్య పనుల్లో వేలాది మంది కార్మికులు భాగస్వాములు అవుతున్నారు. వారందరికీ గ్లౌజులతోపాటు శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచారు. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులు ప్రతి పంచాయతీకి శానిటైజర్ డబ్బాలను అందజేశారు. అందులో కొంత పారిశుద్ధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టిన తర్వాత చేతులను శుభ్రం చేసుకునే విధానంపై వారికి అధికారులు అవగాహన కల్పించారు. వీధులు, ప్రభుత్వ భవనాల్లో రసాయనాల పిచికారీ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భౌతికదూరం పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు.
విస్తృతంగా పరిశుభ్రత చర్యలు
గ్రామీణ ప్రాంత ప్రజల్లో వ్యాధులు, ఇతర సామాజిక అంశాలపై అవగాహన కొంత తక్కువగా ఉంటుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను విస్తృతంగా చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు మురుగు కాలువలను శుభ్రం చేయించడంతోపాటు వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం రసాయనాలను పిచికారీ చేయిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది స్వీయ రక్షణ కోసం శానిటైజర్లను సైతం పంపిణీ చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆయా పంచాయతీల పాలకవర్గాలతోపాటు కార్యదర్శులు పర్యవేక్షిస్తూ హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు.
జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పిచికారీ చేసేందుకు తొలుత 45 కిలోల హైపోక్లోరైట్ ద్రావణాన్ని తెప్పించి ఆయా గ్రామాలకు సరఫరా చేయగా, మరికొన్ని డబ్బాలు తెప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు.