ఇందూరు / డిచ్పల్లి, మే 7: జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. నగరంలోని దుబ్బాలో ఉన్న లక్ష్మీప్రసన్న, డిచ్పల్లి మండలం సుద్దపల్లిలోని సాయి ఆక్సిజన్ ప్లాంట్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారినపడి దవాఖానల్లో చికిత్సపొందుతున్న వారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆక్సిజన్ కొరత రాకుండా చూడాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టి తీసుకురావాలని సూచించారు. అనంతరం లిక్విడ్ ప్రొడక్షన్, అందుబాటులో ఉన్న ఆక్సిజన్ వివరాలపై ఏజెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు.
లక్షణాలున్న వారికి మెడికల్ కిట్ ఇవ్వాలి
స్వలంగా కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి వెంటనే మెడికల్ కిట్లను అందజేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి జ్వర సర్వే బృందాన్ని ఆదేశించారు. డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొద్దిపాటి లక్షణాలున్న వారు హోం ఐసొలేషన్లో ఉంటూ మెడికల్ కిట్లోని మందులు వాడేలా సూచించాలని తెలిపారు. నడిపల్లిలో 4, డిచ్పల్లిలో 2, గాంధీనగర్లో ఒక బృందం ఇంటింటా జ్వర సర్వే నిర్వహిస్తున్నదని, లక్షణాలు ఉన్నవారు భయపడకుండా వైద్య సిబ్బందిని సంప్రదించాలని కోరారు. కలెక్టర్ వెంట సర్పంచ్ కులాచారి సతీశ్రావు, పంచాయతీ కార్యదర్శి సదాశివ్, కారోబార్ సంతోష్, ఆశ వర్కర్ విజయ, అంగన్వాడీ టీచర్ శోభ తదితరులు ఉన్నారు.