ఖలీల్వాడి, మే 7: జిల్లా కేంద్రంలో కరోనా బాధితులకు అండగా ఉంటానని, వారికి సహాయ సహకారాలు అందించేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. కరోనా బాధితులకు, వారి సహాయకులకు భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత భోజన వితరణ వాహనాలను ఎమ్మెల్యే శుక్రవారం నగరంలోని క్యాంప్ కార్యాలయం ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో కరోనాతో బాధపడుతూ హోం ఐసోలేషన్లో ఉన్నవారికి, వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు, వారి సహాయకులకు సొంత ఖర్చుతో తన తండ్రి దివంగత బిగాల కృష్ణమూర్తి స్మృతిలో ఉచితంగా భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని తమ తండ్రి ఎప్పుడూ చెబుతుండేవాడని అందులో భాగంగా కరోనా బాధితులకు తనవంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు.
గత సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన అత్యవసర సేవల సిబ్బందికి 41 రోజుల పాటు నిర్విరామంగా భోజనం అందించినట్లు తెలిపారు. నగరంలోని ఆరు ప్రధాన కూడళ్లల్లో భోజన వితరణ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. వివిధ కూడళ్ల వద్ద మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఉచిత భోజన వాహనాలు అందుబాటులో ఉంటాయని, కరోనా బాధిత కుటుంబీకులు భోజన ప్యాకెట్లను తీసుకెళ్లాలని కోరారు. ఒకవేళ బాధిత కుటుంబీకులు రాలేని పరిస్థితిలో ఉంటే కాల్సెంటర్ నెంబర్లకి ఒక రోజు ముందుగా ఫోన్ చేసి వివరాలు అందిస్తే ఇంటి వద్దకే అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు వహిస్తూ మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని ఎమ్మెల్యే కోరారు.
ఆందోళన చెందొద్దు..
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ నిజామాబాద్ జిల్లా దవాఖానకు అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్, యాంటీ వైరల్ డ్రగ్ ఇతర సప్లిమెంటరీ మందులను సమకూరుస్తున్నామన్నారు. కరోనా బారిన పడిన వారు ఆందోళన చెందొద్దని, వారికి ఎళ్లవేళలా అండగా ఉంటామని, మనో ధైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేశ్ వీ పాటిల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భోజన వితరణ వాహనాల సమాచారం