నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 4: పల్లెల అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలంటూ కలెక్టర్ కోరడంతో దాతలు ముందుకు వచ్చారు. ఆయన సూచన మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు ఆదివారం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దాతల నుంచి విరాళాలను సేకరించారు. ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో డీపీవో జయసుధ సమక్షంలో పలువురు విరాళాలు అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్ గజవాడ జైపాల్ రూ.1.9 లక్షలు, రైజింగ్ స్టార్ యూత్ రూ.2.25 లక్షలు, 2004-05 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు రూ.50 వేలు, ముల్క శ్రీనివాస్ రూ. 65 వేలు, రిటైర్డ్ తహసీల్దార్ నర్సింహులు రూ.10వేలు, కందగిరి వినోద్ రూ. 6 వేలు అందజేయగా మొత్తం రూ. 5లక్షల 71వేలు సమకూరాయి. ముల్లంగి గ్రామంలో కాటిపల్లి వికాస్రెడ్డి రూ.2.25 లక్షలతో స్వర్గరథం అందజేశారు. గల్ఫ్ యువకులు రూ.65 వేలతో డెడ్బాడీ ఫీజర్ను అందజేశారు. ఎంపీవో రామకృష్ణ, సర్పంచులు గడ్డం రాధాకృష్ణారెడ్డి, పాశం లావణ్య మధు, విండో చైర్మన్ గజవాడ జైపాల్, ఎంపీటీసీలు కొత్తూర్ మానస సాయి, నర్సయ్య, ఉప సర్పంచులు మురళి, రవీందర్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ మధుసూదన్, జీపీ కార్యదర్శులు వినయ్, సంతోష్రెడ్డి పాల్గొన్నారు.
మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఎర్పాటు కోసం కారుమంచి రాఘవ, చంద్రకళ దంపతులు రూ. లక్షా 50వేల విరాళాన్ని అందజేసి మా ఊరి మహరాజుగా నిలిచారని ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ సుబ్బారావు తెలిపారు. దీంతోపాటు వివిధ గ్రామాల్లో దాతలు మొత్తం రూ. 2 లక్షల 37,500 అందించినట్లు చెప్పారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ఏనుగు చంద్రశేఖర్ రూ. లక్ష విరాళంగా ప్రకటించారని సర్పంచ్ వనజా గోవర్ధన్ గౌడ్ తెలిపారు. ఈ డబ్బులతో స్వర్గయాత్ర రథాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జీపీ కార్యదర్శి శ్రీధర్, ఎంపీవో వెంకటేశ్, స్పెషల్ ఆఫీసర్ గంగాధర్ పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్లో సర్పంచ్ మామిడి సౌజన్యాసుమన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దాతలు రూ.15,500 విరాళాలు అందించారు. ఉప సర్పంచ్ పల్లపు లావణ్య, ఎంపీవో శ్రీధర్, స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, కార్యదర్శి అజయ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలంలో అన్ని గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దాతల నుంచి విరాళాలను సేకరించామని సర్పంచులు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు కల్లెం మోహన్రెడ్డి, పుట్టింటి లింబారెడ్డి, అసపురం దేవీ శ్రీనివాస్రెడ్డి, మచ్చర్ల పూజితా కిశోర్రెడ్డి, బండమీది జమునా గంగాధర్, టీసీ సాయన్న, గడ్డం సరోజ, గంజి నర్సయ్య, కొత్తపల్లి లక్ష్మి, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రెంజల్ మండలంలో దాతల నుంచి రూ. 4,60,274 సేకరించామని ఎంపీడీవో గోపాలకృష్ణ తెలిపారు. ఎడపల్లి మండలం నెహ్రూనగర్లో ఎన్ఆర్ఐ మహమ్మద్ బషీర్ఖాన్ రూ.10 వేల విరాళం అందజేశారని సర్పంచుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమానుల్లా షరీఫ్, ఎంపీడీవో శంకర్, మండల ప్రత్యేకాధికారి రమేశ్ తెలిపారు.
ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో పాఠశాల అభివృద్ధి కోసం నిజామాబాద్ విద్యుత్ సబ్ డివిజన్-2 ఏడీఈ తోట రాజశేఖర్ రూ.10వేలు అందజేశారు. జాన్కంపేట్ గ్రామంలోనూ దాతలు విరాళాలు అందజేశారని సర్పంచ్ సాయిలు, ఎంపీడీవో తెలిపారు. నవీపేట మండలంలో దాతలు రూ.4 లక్షల విరాళాలు ఇచ్చారని ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ తెలిపారు. అబ్బాపూర్(ఎం) గ్రామానికి డెడ్బాడీలను భద్రపర్చే ఫ్రీజర్ను నిజామాబాద్కు చెందిన మనోరమ హాస్పిటల్ యాజమాన్యం విరాళంగా ప్రకటించిందని ఎంపీడీవో తెలిపారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో దాతలు రూ. 15వేలు విరాళాలు అందజేశారని సర్పంచ్ సక్కారం అశోక్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ విక్రమ్, వార్డు సభ్యులు, జీపీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. మోస్రా మండలం తిమ్మాపూర్లో పలువురు రూ.7వేలు అందజేసినట్లు సర్పంచ్ సున్నం భూమయ్య తెలిపారు. శవ పేటికను అందజేసేందుకు మరొకరు ముందుకు వచ్చారన్నారు. సిరికొండ మండలంలో డొనేషన్స్ డే కార్యక్రమాన్ని చేపట్టారు. చీమన్పల్లిలో సర్పంచ్ క్యాతం పద్మాశివారెడ్డి రూ.5వేల విరాళం అందజేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే రూ.2.5 లక్షల విరాళం
వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో దాతల నుంచి విరాళాలను సేకరించారు. స్వర్గరథం ఏర్పాటుకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి రూ.2లక్షల 50వేలు ప్రకటించారు. అలాగే పద్మారావు చౌడ పోచమ్మ మెమోరియల్ ట్రస్ట్, ప్రతాప్, జర్నలిస్టు ప్రభాకర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ జంగం ఆశ్విన్ కుమార్, హెచ్ఎం జంగం అశోక్ తదితరులు విరాళాలు అందజేశారని సర్పంచ్ సౌడ ప్రేమలతా రమేశ్ తెలిపారు. విరాళలను ప్రత్యేక అధికారిణి నీరజకు అందజేశారు.