ప్రభుత్వ ఆదేశాలతో వివిధ జిల్లాల జైళ్లకు ఖైదీల తరలింపు
నిజామాబాద్ జైలుకు 50 మంది రాక..
త్వరలో మరో 50మందిని తరలించే అవకాశం
అన్ని వసతులు కల్పిస్తాం : సూపరింటెండెంట్
నిజామాబాద్ రూరల్, జూన్ 3 : వరంగల్ జిల్లా జైలు నుంచి 50 మంది ఖైదీలను గురువారం సాయంత్రం సారంగాపూర్ శివారులో ఉన్న నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు. వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న జిల్లా జైలును మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ జైలులో ఉన్న ఖైదీలను వివి ధ జిల్లాల్లో ఉన్న జైళ్లకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ తరుణంలో ఉన్నతాధికారులు వరంగల్ జిల్లా జైలు నుంచి ఖైదీలను ఆయా జిల్లాల జైళ్లకు తరలిస్తున్నారు. ఇందులో భాగంగానే 50 మంది ఖైదీలను ఇక్కడి జిల్లా జైలుకు తరలించారని జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ తెలిపారు. అదేవిధంగా మరో 50 మంది ఖైదీలను కూడా శుక్రవారం అక్కడినుంచి ఇక్కడి జైలుకు తరలించనున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా జైలులో 460 మంది ఖైదీలుండేందుకు తగిన వసతులు ఉన్నాయని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ జైలులో 300 మంది ఖైదీలుండగా.. వరంగల్ నుంచి వచ్చిన 50 మంది ఖైదీలతో సంఖ్య 350కి చేరుకుందన్నారు. మరో 50 మంది ఖైదీలు రేపు రానున్నందున మొత్తం ఖైదీల సంఖ్య 400 చేరుకోనుందని జైలు సూపరింటెండెంట్ వివరించారు. ఖైదీలందరికీ తగిన వసతులు కల్పిస్తామని తెలిపారు.