కమ్మర్పల్లి, జూన్ 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం మే 12వ తేదీ నుంచి అమలుచేసిన లాక్డౌన్ సత్ఫలితాలను ఇచ్చింది. కొవిడ్ వ్యాప్తి నియంత్రణలోకి రావ డం, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గినట్లు నివేదికలు రావడంతో ఆదివారం నుంచి లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దుకాణాలు, వ్యాపారాలు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్ధేశం చేస్తూ సమీక్షలు నిర్వహించడంతో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ ఇతర అధికారుల సమష్టి కృషితో 38 రోజుల పాటు కొనసాగిన లాక్డౌన్ జిల్లాలో కరోనా అదుపులోకి వచ్చేందుకు దోహదపడింది.
ఆందోళన కలిగించిన సెకండ్ వేవ్..
కరోనా సెకండ్ వేవ్ సర్వత్రా ఆందోళన కలిగించింది. కొవిడ్ మరణాలు ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వ లాక్డౌన్ను విధించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణే లక్ష్యంగా అధికారులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేశారు. ప్రజలు పలు ఇబ్బందులు పడ్డా లాక్డౌన్ కఠినంగా కొనసాగింది. కరోనా వ్యాప్తి తగ్గుతుండడంతో ప్రజలు కూడా లాక్డౌన్కు పూర్తిగా సహకరించారు. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్న సమయంలో రైతులు, వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వారికి పలు మినహాయింపులు ఇచ్చారు. ఇది రైతుల ఇబ్బందులను తొలగించింది. లాక్డౌన్ సమయంలోనూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగాయి.
నిబంధనలు పాటించాల్సిందే..
లాక్ డౌన్ను సంపూర్ణంగా ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో అన్ని వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయని చెప్పొచ్చు. గత 38 రోజులుగా నిర్మానుష్యంగా ఉన్న దుకాణాలు, వ్యాపార సముదాయాలు, రోడ్లు నేటి నుంచి కిటకిటలాడనున్నాయి. కరోనా తగ్గిందన్న నివేదికలు రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి నెలకొన్నది. వైరస్ వ్యాప్తి తగ్గినా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇండ్ల నుంచి బయటికి వచ్చినప్పుడు మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు.