బోధన్, మే 2: పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏ ఇతర రాష్ట్రంలో లేనివిధంగా అమలవుతున్నాయని బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ అన్నారు. బుధవారం పట్టణంలోని బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగఫలితంగా స్వరాష్ర్టాన్ని సాధించుకున్నామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి వల్ల ఎందరో తమ ఆప్తులను, కుటుంబసభ్యులను పోగొట్టుకున్నారని, తన తండ్రిని కూడా కోల్పోయానని ఆయన ఉద్వేగానికి గురయ్యారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, ఇందులోభాగంగా బోధన్ ప్రభుత్వ జిల్లా దవాఖానలో వంద ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో బోధన్ ఎంపీపీ వైస్ చైర్మన్ కోట గంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గింజుపల్లి శరత్, బోధన్ ఎంపీపీ చైర్మన్ అర్చనా వాగ్మారే, టీఆర్ఎస్ నాయకులు బుద్దె రాజేశ్వర్, వెంకట్రెడ్డి, హన్మంతు, టీఆర్ఎస్ బోధన్ మండల అధ్యక్షుడు సంజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లావ్యాప్తంగా సంబురాలు..
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 2: జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు జడ్పీ కార్యాలయం, ఆఫీసర్స్ క్లబ్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిజామాబాద్ నగరంలోని వివిధ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఎస్సెస్సార్ కళాశాలలో కళాశాల చైర్మన్, తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు ఎం.మారయ్యగౌడ్, టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్, సెంట్రల్ లైబ్రరీలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో జిల్లా సహాయ కమిషనర్ సోమయ్య జెండాలను ఆవిష్కరించారు. పోలీసు కమిషనర్ కార్తికేయ నగరంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి సీపీ క్యాంపు కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. పోలీసు కార్యాలయంలో అదనపు డీసీపీ ఉషావిశ్వనాథ్, ఏఆర్ హెడ్క్వార్టర్స్లో అదనపు డీసీపీ భాస్కర్, డీఐజీ కార్యాలయంలో అదనపు డీసీపీ స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్లో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు తారిక్అన్సారీ, రెడ్కో చైర్మన్ అలీం పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించగా డాక్టర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు. నుడా కార్యాలయంలో చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్మూర్లో బల్దియా చైర్పర్సన్ వినిత, బోధన్లో చైర్పర్సన్ తూము పద్మావతి, నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఇందిర జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పాల్గొన్నారు. వేల్పూర్లో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకల్లో వీసీ రవీందర్ పరిపాలన భవనం ఎదుట మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పలు గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు.