శక్కర్నగర్, జూన్ 2: బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్పై, మున్సిపల్ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని, అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ జి.రామలింగం, కౌన్సిలర్లతో కలిసి ఆమె మాట్లాడారు. బోధన్ ఎన్ఎస్ఎఫ్ ప్లేగ్రౌండ్లో ఎమ్మెల్యే షకీల్ తన సొంత నిధులతో క్రికెట్ టోర్నీని నిర్వహించారని చెప్పారు. శక్కర్నగర్లోని ప్లేగ్రౌండ్ను, మినీ స్టేడియాన్ని పంచాయతీ రాజ్వారు మున్సిపల్శాఖకు అప్పగించిన కారణంగా పట్టణ ప్రగతిలో భాగంగా ప్లేగ్రౌండ్ అభివృద్ధికి మున్సిపల్ నిధులు కేటాయించేందుకు ఎజెండాలో పెట్టామన్నారు. దీని అభివృద్దికి పట్టణ ప్రగతినిధులతోపాటు, ఎమ్మెల్యే ద్వారా సీడీపీ నిధులు 30లక్షలు, ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా 20 లక్షల రూపాయలు, ఎమ్మెల్సీ కవిత ద్వారా మరో 20 లక్షల రూపాయలు మంజూరు చేయించి ప్లేగ్రౌండ్ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. డీఈఈ లింగంపల్లి శివానందం, ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి తదితరులు ఉన్నారు.