విద్యానగర్, ఖలీల్వాడి, ఏప్రిల్ 10: ఉమ్మడి జిల్లాలో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలో 660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 2513 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 464 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 15,947 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 196 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 21,616 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. నవీపేట 30, కోటగిరి మండలంలో 40, నందిపేట్ మండలంలో 80 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు.
నవోదయలో కరోనా కలకలం
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. నిజాంసాగర్ ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు 10, 12వ తరగతులకు చెందిన 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. పది రోజుల క్రితం నవోదయలో విధులు నిర్వహించే ఐదుగురు ఉద్యోగులకు పాజిటివ్ రాగా.. రెండు రోజుల క్రితం మరొకరికి వచ్చింది. ప్రస్తుతం నవోదయలో 10, 12వ తరగతికి చెందిన విద్యార్థులకు తరగతులు కొనసాగుతున్నాయి. శనివారం ఏకంగా 13 మందికి పాజిటివ్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్యశాఖ అధికారులు శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించారు. ప్రస్తుతం విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. శనివారం మొత్తం 2750 మందికి గాను 3053మంది టీకా వేసుకున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో 30 కేంద్రాల్లో 6,632 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 75,930 మంది టీకా తీసుకున్నట్లు పేర్కొన్నారు.