నర్సరీల ఏర్పాటుతో పలువురికి ఉపాధి
కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న రైతులు
ఆర్మూర్, మే 26: ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై దృష్టికి పెడుతున్నారు. దీంతో పెరుగుతున్న కూరగాయలు, పండ్ల వినియోగంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. తమ అవసరాలకు అనుగుణంగా వాటిని ఇండ్ల ఆవరణలో, పొలాల్లో పెంచేందుకు చాలా మంది ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని పలువురు జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నుంచి రైతులు తమకు అవసరమైన మొక్కలను కొనుగోలు చేసి తమ పొలాల్లో నాటుతున్నారు. నర్సరీల సేవలను బాగున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారి వెంట..
ప్రస్తుతం కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు ఏర్పడిన డిమాండ్ను పలువురు అందిపుచ్చుకొని ప్రధానరహదారుల వెంట నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లో ఇప్పటికే నర్సరీలు ఏర్పాటయ్యాయి. వీటిలో వివిధ రకాల మొక్కలను పెంచి విక్రయిస్తున్నారు. కూరగాయల మొక్క ఒక్కోటి 70పైసల నుంచి మూడు రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మొక్కలన్నీ నర్సరీల్లో లభించడంతో రైతులకు చాలా వెసులుబాటు అవుతున్నది. గతంలో కూరగాయలు సాగు చేయాలంటే రైతు తమ పొలంలో నారుమడి పోసి మొక్కలు పెరిగిన అనంతరం నాటు వేసి అవి పెద్దగా పెరిగే వరకు కష్టపడాల్సి వచ్చేది. ప్రస్తుతం మడిని సిద్ధం చేసుకొని రెడిమేడ్గా లభించే మొక్కలను తెచ్చి నాటుతున్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు ..
నర్సరీల్లో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ప్లాస్టిక్ కుండీలను ఏర్పాటు చేసుకొని ఒక్కో కుండీలో ఒక రకం మొక్కలను పెంచుతున్నారు. మొక్కలు వ్యాధుల బారిన పడకుండా సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. మొక్కల పెంపకం కోసం సారవంతమైన మట్టిని వినియోగిస్తున్నారు. నర్సరీల్లో ముఖ్యంగా టమాట, వంకాయ, గోబీ, మిరపతో పాటు పలురకాల పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు.
ఎప్పుడైనా మొక్కలు సిద్ధం..
నర్సరీల్లో ప్రజలకు కావాల్సిన మొక్కలు ఎప్పుడంటే అప్పుడు లభిస్తున్నాయి. దీంతో అనుకున్నదే తడువుగా రైతులు సమయానుకూలంగా కావాల్సిన కూరగాయల మొక్కలను తెచ్చి పొలాల్లో నాటి అధిక లాభాలు పొందుతున్నారు. వారికి సమయం కూడా కలిసి వస్తున్నది. నర్సరీల్లో మొక్కలు లభిస్తుండడంతో చాలా మంది తమ ఇంటి పెరట్లో కూడా నాటి ఇంటికి కావాల్సిన కూరగాయలను సాగుచేసుకుంటున్నారు.
నాలుగేండ్లుగా విక్రయిస్తున్నాం..
అంకాపూర్లో నాలుగేండ్ల క్రితమే నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను విక్రయిస్తున్నాను. ఆరు నెలల క్రితం చేపూర్లో జాతీయ రహదారి పక్కన మరో నర్సరీని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం మొక్కలకు గిరాకీ బాగా పెరిగింది. నర్సరీలతో ఉపాధి బాగున్నది.
-శ్రావణ్, నర్సరీ నిర్వాహకుడు,
అంకాపూర్.
సమయం కలిసి వస్తున్నది..
కూరగాయల నారు పెంచుకొనేందుకు గతం లో నెల రోజుల సమ యం పట్టేది. ప్రస్తుతం భూమిని సిద్ధంగా చేసుకొని నర్సరీల నుంచి మొక్కలను తెచ్చి నాటడమే. అన్ని రకాల మొక్కలు లభిస్తుండడంతో ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. రోజువారీ అవసరాల కోసం కూరగాయల మొక్కలను ఇంటి ఆవరణలో కూడా పెంచుకోవచ్చు.